‘లాఠీఛార్జీ చేస్తే ఊరుకోం’

by  |
‘లాఠీఛార్జీ చేస్తే ఊరుకోం’
X

దిశ, భువనగిరి: న‌ల్గొండ ప‌ట్టణంలో లాక్‌ డౌన్ పేరుతో ఈ రోజు(శనివారం)ఉద‌యం పోలీసులు అత్యుత్సాహంతో లాఠీఛార్జీ చేయ‌డాన్ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్ ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైతే ఉ. 09.40 గం.ల‌కే సామాన్య ప్రజ‌ల‌పై విరుచుకుప‌డుతున్నార‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజ‌ల‌తో పాటు త‌మ ప్రాణాల‌కు తెగించి క‌రోనా విప‌త్కర ప‌రిస్థితుల్లో అత్యవ‌స‌ర సేవలు అంద‌జేస్తున్న విద్యుత్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మీడియా ప్రతినిధుల‌పై సైతం లాఠీల‌తో దాడుల‌కు పాల్పడడంపై మండిప‌డ్డారు. పోలీసులు ఓవ‌రాక్షన్ చేస్తే క‌రోనా కాలాన ఎవ‌రు కూడా అత్యవ‌స‌ర సేవ‌లు అందించ‌డానికి ముందుకు వ‌చ్చేందుకు ఆలోచిస్తార‌ని ఆయన స్పష్టం చేశారు. ఏ పోలీసు అధికారి, సిబ్బందికైనా ప్రజ‌ల‌ను కొట్టే అధికారం ఎక్కడిద‌ని నిల‌దీశారు. మ‌ళ్లీ ఇలాంటి చ‌ర్యల‌కు పూనుకుని ఎవ‌రిపైనైనా లాఠీ ఛార్జీ చేస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చరించారు.

Next Story

Most Viewed