పోడు భూములను వన్ టైమ్ సెటిల్మెంట్‌ చేయాలి: కోదండరాం

by  |
పోడు భూములను వన్ టైమ్ సెటిల్మెంట్‌ చేయాలి: కోదండరాం
X

దిశ, అచ్చంపేట: పోడు భూములను సాగు చేసుకోనియ్యకుండా తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ఆదివాసి, దళిత రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో పోడు భూముల కోసం రణభేరి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. పోడు రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. దీనికితోడు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువకులు, గెస్ట్ లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. రాష్ట్ర ప్రజల బతుకు తెరువు గురించి ఆలోచన లేదని, రైతుల పొట్ట మీద కొట్టే ప్రభుత్వమని విమర్శించారు. పోడు భూముల విషయంలో ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి వన్ టైం సెటిల్మెంట్ నిర్ణయం ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతు పోరాట కమిటీ పేరున ప్రతిపక్ష పార్టీలతో కలిసి అక్టోబర్ 5 న రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి పూనుకున్నామని.. ఆ పోరాటంలో ఈ ప్రాంత రైతులు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed