టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

by  |
టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
X

దిశ ప్రతినిధి, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేటలో పోలీసులు సోదాలు నిర్వహించిన ఇండ్లను పరిశీలించి మీడియా తో మాట్లాడుతూ.. ఏ రకమైన సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు నిర్వహించారనీ, ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారని ఆయన అన్నారు. మహిళల పట్ల, పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. స్వయానా మా అభ్యర్థి రఘునందన్ భార్యతో దురుసుగా ప్రవర్తించారని ఆయన అన్నారు. బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ పై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై, ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి పై పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తి అప్రజాస్వామికమని, ఎన్నికల నిబంధనలకు ఇది వ్యతిరేకమన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజల తీర్పే అంతిమమని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని టీఆర్ఎస్ గుర్తించుకుంటే బాగుండేదన్నారు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, చెన్నారెడ్డి, చంద్రబాబు లాంటి అగ్ర నేతలనే ప్రజలు ఓడించారని, అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదన్నారు. కేసీఆర్ కుటుంబమే శాశ్వతంగా పరిపాలిస్తారనుకోవడం వారి భ్రమనే అవుతుందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలలో ఎన్నో ఉప ఎన్నికలు చూసాం కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పూర్తిగా ఆరాచకం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ ను ఈపాటికే ఎన్నికల కమిషన్ బదిలీ చేసిందనీ అన్నారు. బండి సంజయ్ పై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దుబ్బాక లో బీజేపీ గెలుస్తుందనే సంకేతాలతో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఈ అరాచకాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.


Next Story

Most Viewed