డిసెంబర్ వరకు ఆ వేడుకలు, వ్యాక్సినేషన్: కిషన్ రెడ్డి

by  |
డిసెంబర్ వరకు ఆ వేడుకలు, వ్యాక్సినేషన్: కిషన్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్: భారత స్వాతంత్ర్య అమ్రుతోత్సవాలను ఇక నుంచి ఘనంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ కారణంగా దేశంలో 75వ స్వాతంత్ర్య వేడుకలను ఇప్పటివరకు ప్రజల్లోకి వెళ్లేంతగా నిర్వహించలేదని గుర్తు చేశారు. ఈ వేడుకలను డిసెంబర్ వరకు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కిషన్ రెడ్డి శుక్రవారం నిర్మల్‌లో విమోచన దినోత్సవ సభకు వెళ్తూ ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ దేశ ప్రజలకు ఎంతో గొప్ప రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం, విశ్వకర్మ దినోత్సవాల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని, దేశ పౌరులందరికీ వ్యాక్సిన్ అందుతుందని మంత్రి చెప్పారు. అనంతరం ఆయన పలువురు బీజేపీ నేతలతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రఘునందన్ రావు, అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దోళ్ళ గంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story