కిమ్స్ వైద్యుల అరుదైన ఆపరేషన్

by  |
కిమ్స్ వైద్యుల అరుదైన ఆపరేషన్
X

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్‌: కొవిడ్‌తో తీవ్రంగా బాధ‌ప‌డుతూ సుమారు 53 రోజుల పాటు ఎక్మోపై చికిత్స పొంది, ఆ త‌ర్వాత లంగ్ ఫైబ్రోసిస్ సోకి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న రోగికి ఊపిరితిత్తులు మార్చి కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. నగరంలోని కిమ్స్ ఆసుప‌త్రిలో ప్ర‌ఖ్యాత గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శ‌స్త్రచికిత్స నిపుణులు డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్ నేతృత్వంలోని వైద్యుల బృందం సంక్లిష్ట‌మైన ఈ శ‌స్త్రచికిత్సను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. హర్యానాకు చెందిన 34 ఏండ్ల మార్కెటింగ్ ఉద్యోగికి ఈ ఏడాది అక్టోబ‌ర్ 29న కొవిడ్ సోకిన‌ట్లు గుర్తించారు. అత‌డిని తొలుత ఢిల్లీలోని ఒక ఆసుప‌త్రిలో చేర్చి చికిత్స అందించారు.

కానీ రోగి ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌ సాగింది. దీంతో అత‌డిని తొలుత వెంటిలేట‌ర్ మీద ఉంచి, త‌ర్వాత ఎక్మో చికిత్స అందించారు. కొవిడ్ కార‌ణంగా రోగి ఊపిరితిత్తులు బాగా పాడైన‌ట్లు ప‌రీక్ష‌ల‌లో గుర్తించారు. చివ‌ర‌కు అవి తంతీక‌ర‌ణ ద‌శ‌కు (ఫైబ్రోస్) చేరుకోవడంతో రోగి కుటుంబ‌స‌భ్యులు కిమ్స్‌లోని హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ బృందాన్ని సంప్ర‌దించారు. అప్ప‌టికే అత‌డి ఆరోగ్యం బాగా క్షీణించి స‌మ‌స్య‌లు ఎక్కువ‌య్యాయి. అత‌డి ర‌క్త‌ ప్ర‌వాహంలోనూ ఇన్ఫెక్ష‌న్ సోకింది. వ్యాధి కార‌ణంగా ఎక్కువ కాలం పాటు మంచానికే అతుక్కు పోవ‌డంతో ప‌రిస్థితి విషమంగా మారింది. అత‌డిని ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు తీసుకురావ‌డం కూడా ఇబ్బంది అయినప్పటికీ ఆ యువ‌కుడికి కొత్త జీవితాన్ని ఇవ్వాల‌ని డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్ బృందం నిర్ణ‌యించుకుంది.

రోగిని ముందుగా విజ‌య‌వంతంగా కిమ్స్ ఆసుప‌త్రిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌కు తీసుకొచ్చి అత‌డికి త‌గిన యాంటీబ‌యాటిక్స్‌తో ఇన్ఫెక్ష‌న్ త‌గ్గ‌డానికి చికిత్స చేశారు. 53 రోజుల పాటు ఎక్మో సాయంతో చికిత్స చేసిన త‌ర్వాత రోగికి స‌రిపోయే ఊపిరితిత్తులు దొరికాయి. దాంతో గత నెల 21న రెండు ఊపిరితిత్తులూ మార్చారు. కాగా 53 రోజుల పాటు సుదీర్ఘంగా ఎక్మోసాయంతో చికిత్స చేసిన త‌ర్వాత కొవిడ్ రోగికి ఊపిరితిత్తులు మార్చ‌డం భార‌త‌దేశంలో ఇదే మొద‌టిసారి అని కిమ్స్ యాజమాన్యం ప్రకటించింది.



Next Story

Most Viewed