వనపర్తిలో దారుణం: ఆ విషయంలో గొడవ.. కిడ్నాప్ చేసి చిత్రహింసలు

by  |
వనపర్తిలో దారుణం: ఆ విషయంలో గొడవ.. కిడ్నాప్ చేసి చిత్రహింసలు
X

దిశ, వనపర్తి: వనపర్తి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఆర్థిక లావాదేవీల్లో విబేధాల కారణంగా ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి వారంరోజుల పాటు ఇంట్లో నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. వీపనగండ్ల మండలం సంపత్ రావుపల్లి గ్రామానికి చెందిన మేకల చంద్రయ్య అనే వ్యక్తి హైదరాబాద్ లోని జిహెచ్ఎమ్ సి లో గుత్తేదారుగా మంచి నీటి సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా సరూర్ నగర్ చెందిన శ్రీకాంతాచారిను నియమించుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలలో గొడవ మొదలయ్యింది.

డబ్బు చెల్లించాలని శ్రీకాంత్ ని చంద్రయ్య పలుమార్లు అడిగాడు. అందుకు శ్రీకాంతాచారి స్పందించకపోవడంతో చంద్రయ్య దారుణానికి ఒడిగట్టాడు. అతని నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం కోసం మొదట శ్రీకాంత్ ను రెండు రోజుల తరువాత ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి సంపత్ రావుపల్లి లోని తన నివాసంలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. ఇంట్లో నుండి అరుపులు వినిపించడంతో స్థానికులు 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంతా చారి కుటుంబాన్ని కిడ్నాపర్ చెరనుంచి విడిపించారు. ఇక చిత్రహింసలు పెట్టడంతో శ్రీకాంతాచారి పరిస్థితి విషంగా ఉంది. దీంతో అతనిని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు చంద్రయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


Next Story