ఏపీలో తొలి రోజు కిక్ కాస్ట్ 60 కోట్లు

by  |
ఏపీలో తొలి రోజు కిక్ కాస్ట్ 60 కోట్లు
X

45 రోజుల సుదీర్ఘ విరామం తరువాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు ఆరంభించిన సంగతి తెలిసిందే. తొలి రోజు మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్ శాఖ పంటపండింది. తెలంగాన, తమిళనాడుల్లో మద్యం దుకాణాలు తెరచుకోకపోవడం కూడా ఏపీకి కలిసొచ్చింది.

దీంతో ఒక్కసారిగా మందుబాబులు ఎగబడ్డారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ మరోసారి పొడించే ప్రమాదం ఉందన్న ఆందోళనతో భారీ సంఖ్యలో మద్యం కొనుగోళ్లకు మందుబాబులు ఆసక్తి చూపారు. ఎక్కువ మంది కార్టన్లకు కార్టన్లు కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే గత నెల రోజులుగా ఉపాధి లేకపోవడానికి తోడు ధరల పెంపు కారణంగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసిన బడుగు జీవులు పరిమిత మద్యం కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ఏపీలోని మద్యం దుకాణాల్లో ఉదయ 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మందుబాబుల కోలాహలం కొనసాగింది.

7 దాటిన తరువాత కూడా మద్యం కొనుగోళ్లకు మందుబాబులు ఆసక్తి చూపడంతో మద్యం దుకాణాల వద్ద రాత్రి ఏడు గంటల వరకు వరుసలో నిలబడి ఉన్న వారికి అధికారులు స్లిప్పులను అందజేశారు. ఈ స్లిప్పులు ఉన్న వారికి నేడు ముందుగా మద్యం విక్రయిస్తారు. వారికి మద్యం అమ్మిన తరువాతే మిగిలిన వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.

మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో ఏపీలో తొలిరోజు 60 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా. ఏపీలో అధికారికంగా మొత్తం 3,468 దుకాణాలు ఉన్నాయి. కంటైన్‌మెంట్ జోన్ల ఆంక్షల నేపథ్యంలో తొలి రోజు 2,345 మద్యం దుకాణాలను తెరిచారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో మాత్రం మద్యం దుకాణాలు తెరవలేదు. ఏపీలో ధరలు పెరగక ముందు 65 నుంచి 70 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. కంటైన్‌మెంట్ జోన్లలో షాపులు తెరవకపోవడంతో మెజారిటీ షాపులు తెరిచినప్పటికీ సుమారు 1125 దుకాణాలు తెరవకపోవడంతో కొంత ఆదాయానికి గండిపడింది. మరోవైపు కొన్ని చోట్ల ఘర్షణల నేపథ్యంలో దుకాణాలు మూతవేయాల్సి వచ్చింది.

మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లోని మద్యం దుకాణాల వద్దకు రెండు రాష్ట్రాల వాసులు పోటెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొనడంతో పలుచోట్ల మద్యం విక్రయాలు నిలిపేశారు. పోలీసులు, స్థానికుల సాయంతో మద్యం విక్రయాలు కొనసాగించారు. దీంతో తొలి రోజు ఏపీలో 60 కోట్ల రూపాయలు విలువైన మద్యం అమ్మకమైంది. నేడు కూడా అదే స్ధాయిలో మద్యం విక్రయాలు జరుగుతాయని అంచనాలున్నాయి.

Tags: liquor business, liquor shopes, andhrapradesh, dirnkers,

Next Story