రెండేళ్లలో కీలక మైలురాయిని చేరుకున్న కియా మోటార్స్ ఇండియా

by  |
రెండేళ్లలో కీలక మైలురాయిని చేరుకున్న కియా మోటార్స్ ఇండియా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్ల కాలంలో కీలక మైలురాయిని చేరుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో మొదటి కారును విడుదల చేసిన రెండేళ్లలో తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కారు కియా సెల్టోస్ 2 లక్షల యూనిట్లను విక్రయించినట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్టెడ్ కార్ల విక్రయాల్లో కూడా అదే స్థాయిలో 1.5 లక్షల యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. కియా భారత్‌లో అమ్మిన మొత్తం కార్లలో ఎస్‌యూవీ సెల్టోస్ అత్యధికంగా 66 శాతం వాటాను కలిగి ఉంది.

ఇప్పటివరకు మొత్తం అమ్మకాలు 3 లక్షలు దాటినట్టు కంపెనీ పేర్కొంది. సెల్టోస్ విక్రయాల్లో 58 శాతం టాప్ వేరియంట్ ఉన్నప్పటికీ, ఈ మోడల్ ఆటొమెటిక్ వేరియంట్ 35 శాతం ఉన్నట్టు కంపెనీ వివరించింది. ఇక, డీజిల్ వేరియంట్ కార్ల వాటా 45 శాతమని కంపెనీ తెలిపింది. ‘ వినియోగదారులకు కొత్త టెక్నాలజీతో కూడిన మెరుగైన వాహనాలను అందించడమే కంపెనీ లక్ష్యం. ఈ క్రమంలో రెండేళ్లలో కీలక మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉంది. తక్కువ కాలంలో గణానీయమైన అమ్మకాలతో కొనసాగుతుండటం సంస్థ నిబద్ధతకు నిదర్శనమని, ఇది మాలో మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. ఆటో పరిశ్రంలో కొత్త విప్లవాన్ని, కొత్త యుగంలో కొనుగోలుదారులకు ప్రీమియం ఉత్పత్తులను అందించడానికి సిద్ధంగా ఉన్నామని’ కియా మోటార్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టె జిన్ పార్క్ చెప్పారు.



Next Story