ఎలక్ట్రిక్ కార్ల తయారీపై వచ్చే ఏడాది నిర్ణయం: కియా ఇండియా!

by  |
kia
X

దిశ, వెబ్‌డెస్క్: కార్ల తయారీ సంస్థ కియా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించింది. గురువారం కంపెనీ తన సరికొత్త 7-సీటర్ కారెన్స్ మోడల్ కారును గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా తెలిపింది. కారెన్స్ మోడల్ వచ్చే ఏడాది మార్చిలో దేశీయ మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 2022లో తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యూహంపై నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొంది.

ప్రస్తుతం దీనికి సంబంధించి అధ్యయనం జరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు, రేంజ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు తయారీకి ముందున్న కీలక అంశాలు. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత, వచ్చే ఏడాదిలోపు ఈ విభాగంలో అనుసరించబోయే వ్యూహాన్ని ప్రకటిస్తామని కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్-ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ అన్నారు. ఈవీ విభాగంలో హ్యూండాయ్‌తో భాగస్వామ్యం ఉంటుందా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన.. బ్యాకెండ్‌లో వివిధ సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాం. అయితే, ఈవీ మార్కెట్లో తాము సొంతంగానే కొనసాగాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. గురువారం లాంచ్ చేసిన కారెన్స్ మోడల్‌ను సరికొత్త డిజైన్, హై-టెక్నాలజీ ఫీచర్లతో తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. మ‌ల్టీ ఫంక్ష‌న‌ల్ స్టీరింగ్ వీల్‌ సహా 10 అంగుళాల ట‌చ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, పూర్తిస్థాయి డిజిట‌్‌తో కూడిన అత్యాధునిక ఫీచ‌ర్లు ఇందులో ఉన్నయని కంపెనీ వెళ్లడించింది. భారత్‌లో దీని ధ‌ర రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని పరిశ్రమ వర్గాల అంచ‌నా వేస్తున్నారు.

Next Story

Most Viewed