ఖేల్ రత్న, అర్జున అవార్డుల రద్దు?

by  |
ఖేల్ రత్న, అర్జున అవార్డుల రద్దు?
X

దిశ, స్పోర్ట్స్: క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను రద్దు చేయాలని.. వాటి స్థానంలో ఓకే అవార్డును ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ క్రీడా మంత్రిత్వ శాఖను సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న అన్ని రకాల అవార్డులను క్రమబద్దీకరించి.. ఒక శాఖ తరఫున ఓకే అత్యున్నత అవార్డు ఏర్పాటు చేయాలని హోం శాఖ భావిస్తున్నది. క్రీడాకారులకు ఇస్తున్న ఖల్‌రత్న, అర్జున అవార్డులు దాదాపు ఒకే రకమైనవి. కాబట్టి ఈ రెండింటినీ ఏకం చేసి ఒకే అవార్డు ఇవ్వాలని హోం శాఖ కోరింది. ఈ సూచనను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సూచన ప్రాయంగా అంగీకరించింది. అయితే ఈ ఏడాదికి మాత్రం పాత పద్ధతిలోనే అవార్డులు ప్రకటిస్తామని.. వచ్చే ఏడాది నుంచి దీనికి సంబంధించి సమూల మార్పులు చేస్తామని క్రీడాశాఖ వెల్లడించింది.

ఏడాది నుంచి కసరత్తు..

క్రీడా రంగంలో ఇస్తున్న అవార్డులకు సంబంధించి క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు హోంశాఖ గత ఏడాది జులై, సెప్టెంబర్ నెలల్లో రెండు లేఖలు రాసింది. రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులను కలిపేసి ఒకే జాతీయ అవార్డు ఉండేలా చూడాలని కోరింది. అలాగే ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య అవార్డుల విషయంలో కూడా ఈ పద్దతిని సమీక్షించాలని మరో లేఖలో కోరింది. అంతే కాకుండా గతంలో అవార్డుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించి ప్రతీ ఏడాది ఎక్కువ సంఖ్యలో గ్రహీతలను ప్రకటిస్తున్నారని కూడా హోం శాఖ పేర్కొన్నది. కాగా, ఈ విషయంపై స్పందించిన క్రీడా శాఖ వివరణ ఇచ్చింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఒలంపిక్ గేమ్స్‌కు సంబంధించి క్రీడాకారులను ఉత్తేజపరచడానికే గత కొన్నేళ్లుగా ఎక్కువ అవార్డులు ప్రకటిస్తున్నామని చెప్పింది. క్రీడా అవార్డుల క్రమబద్దీకరణకు ఏడాది కాలంగా ప్రయత్నాలు ప్రారంభించామని.. ఈ ఏడాది మాత్రం గత ఏడాదిలాగానే అవార్డులు ప్రకటిస్తామని హోం శాఖ తెలిపింది. 2022 నుంచి క్రమబద్దీకరించిన తర్వాత అవార్డులు ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

ఇక కేటగిరీలు వేరైనా.. అవార్డు ఒక్కటే

క్రీడా పురస్కారాల్లో క్రమబద్దీకరణ అనంతరం ఖేల్‌రత్న, అర్జున అవార్డులను కలిపేసి జాతీయ స్థాయిలో ఒకటే అవార్డు ప్రకటిస్తారు. ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య అవార్డుల స్థానంలో కూడా ఒకటే అవార్డు ఉండనున్నది. అర్జున అవార్డు గెలిచిన వారికే ఆ తర్వాత ఖేల్‌రత్న అవార్డు ఇస్తున్నారు. అంటే ఇవి రెండూ ఒకే కేటగిరీ అవార్డులే కానీ కేవలం అర్జున అవార్డు గెలవడమే ఖేల్‌రత్నకు ప్రాతిపదికగా ఉండటం వల్ల అర్హులైన వారికి అవార్డు దక్కడం లేదని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది. ఇకపై ఈ రెండు అవార్డులను కలిపేయాల్సిందే అని కోరింది. అలాగే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని కూడా కలిపి ఒకటే అవార్డును ఇవ్వాలని హోం శాఖ సూచించింది. హోం శాఖ చేసిన సూచనలన్నీ పరిశీలించడానికి ‘అవార్డ్ సెల్’ను ప్రారంభించాలని క్రీడా శాఖ నిర్ణయించింది. ఇకపై అవార్డుల కోసం అన్ని అభ్యర్థనలు ఈ సెల్ పరిశీలించనున్నది.

Next Story

Most Viewed