టెన్షన్… టెన్షన్…

by  |
టెన్షన్… టెన్షన్…
X

కరోనా అందరినీ కలవరపెడుతోంది. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే వారు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న పోలీస్ సిబ్బందిని ఈ వైరస్ టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో విధులు నిర్వహించి వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ బెటాలియన్ కు చెందిన 12 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో పోలీసులు మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా పోలీసులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా ప‌నిచేస్తున్న పోలీస్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల హైద‌రాబాద్‌‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో విధులు నిర్వ‌హించి వ‌చ్చిన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చాత‌కొండ బెటాలియ‌న్‌కు చెందిన 12మంది పోలీస్ సిబ్బందికి క‌రోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇదే జిల్లాలో ల‌క్ష్మీదేవిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు, కొత్త‌గూడెంలోని వ‌న్‌టౌన్‌‌లో ఓ ఎస్ఐకి క‌రోనా సోకినట్టు తేలింది. అయితే ఖ‌మ్మం జిల్లా పోలీస్‌శాఖ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని పోలీస్ అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేసుకుని వచ్చిన అభ్యర్థుల్లో చాలామందికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఖమ్మంలోని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ దాటి రాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. వారిని క‌ల‌వ‌డానికి కుటుంబ స‌భ్యుల‌ను సైతం అనుమ‌తించ‌డం లేదు. పొరుగు జిల్లా భ‌ద్రాద్రితో పాటు హైద‌రాబాద్ పోలీస్ అకాడ‌మీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ‌గా వెలుగు చూడ‌టంతో ఖ‌మ్మం పోలీస్ క‌మిష‌న‌ర్ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించేలా ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేయ‌డానికి వ‌చ్చే వారిలో ముఖ్యుల‌ను, ఆ కేసుకు సంబంధించిన వారినే స్టేష‌న్‌లోనికి అనుమ‌తించాల‌ని ఆదేశించారు.

శానిటైజ‌ర్ల‌ను ప్ర‌తీ స్టేష‌న్‌లో అందుబాటులో ఉంచ‌డం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవ‌డం, మాస్కు ధ‌రించ‌డం వంటివి త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచించారు. ఏమాత్రం నిర్ల‌క్ష్యం ప‌నికి రాద‌ని, ఆయా స్టేష‌న్ల సీఐలు జాగ్ర‌త్త చ‌ర్య‌ల అమ‌లుపై ప‌ర్యేవేక్ష‌ణ చేస్తుండాల‌ని ఆదేశించారు. సీపీ ఆదేశాల మేర‌కు జిల్లా పోలీస్‌ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 50 నుంచి 55 ఏండ్ల బడిన సిబ్బందిని గుర్తించి వారిని క్షేత్ర‌స్థాయి విధులు అప్పగించకుండా స్టేష‌న్ కార్యాల‌యంలోని విధుల‌కు ప‌రిమితం చేస్తున్నారు. సీపీ ఆదేశాల‌కు అనుగుణంగా పోలీస్ కార్యాల‌యాల్లో ప్రవేశానికి ముందు త‌ప్ప‌నిస‌రిగా సిబ్బందికి, ఫిర్యాదుదారుల‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు.

భ‌ద్రాద్రిలోనూ…

చాంత‌కొండ బెటాలియ‌న్‌లో 12మందితో పాటు మ‌రో ఇద్ద‌రు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో జిల్లా ఎస్పీ సునీల్‌ద‌త్ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే జ్వ‌రం, జ‌లుబు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లుంటే క‌చ్చితంగా స్టేష‌న్ అధికారికి సమాచారం అందించాలని సూచించారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారు విధులకు హాజరుకావొద్దని తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వ‌హించే సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్‌తో త‌రుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed