కారులో కంగారు.. కాంగ్రెస్‌లో జోష్

by  |
కారులో కంగారు.. కాంగ్రెస్‌లో జోష్
X

ఖమ్మంలో టీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. పార్టీ చేయించిన అంతర్గత సర్వేలో అధికారపార్టీ కార్పొరేటర్ల పని తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. సర్వే మంత్రి పువ్వాడ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. సర్వే లీక్ అవడంతో కాంగ్రెస్ నూతనోత్సాహం మొదలైంది. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నది.

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం: అతిర‌హ‌స్యం బ‌ట్టబ‌య‌లు అన్న చందంగా టీఆర్ఎస్ చేయించిన సీక్రెట్ స‌ర్వే లీకైన విష‌యం తెలిసిందే. స‌ర్వేలో వ్యతిరేకంగా ఫ‌లితాలు రావ‌డంతో ఆ పార్టీ ముఖ్య నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. ముందు మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌కు ఆ త‌ర్వాత ప్రభుత్వం చేయించిన‌ట్లుగా ప్రచారంలో ఉన్న స‌ర్వే ఫ‌లితాల‌కు పొంత‌న‌ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. లీకైన‌ స‌ర్వేలో పేర్కొన‌బ‌డిన డివిజ‌న్ల వివ‌రాల‌ను, ఆయా డివిజ‌న్ల‌లో కార్పొరేట‌ర్ల ప‌నితీరు, పార్టీ ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే వాస్తవానికి ద‌గ్గర‌గా ఉండ‌టంతో ఖ‌మ్మం ప‌ట్టణ టీఆర్ఎస్ నేత‌ల్లో కంగారు మొద‌లైంది. స‌ర్వేను, ఇత‌ర‌త్రా రాజ‌కీయ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఓ ముఖ్యనేత లీకైన స‌ర్వేను ఉద్దేశించి .. భయపడాల్సినంత డివిజ‌న్లలో పార్టీకి వ్యతిరేకంగా లేద‌ని, మ‌రో మూడు నెల‌ల్లో ప‌నితీరు మెరుగు ప‌ర్చుకుంటే అంతా స‌ర్ధుకుంటుంద‌ని వ్యాఖ్యనించిన‌ట్లు స‌మాచారం. ప‌నితీరు మెరుగుప‌ర్చుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తే మాత్రం పార్టీ నుంచి టికెట్ ఆశించ‌వ‌ద్దని హెచ్చరించేలా ఆయన వ్యాఖ్యలు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

సర్వేపై మంత్రి అజయ్ సీరియస్..

స‌ర్వే అంశాల‌ను మంత్రి అజ‌య్ సీరియ‌స్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. స‌ర్వేలో పేర్కొనబ‌డిన అంశాలు వాస్తవాల‌ను ప్రతిబింభిస్తున్నాయ‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. వ‌చ్చే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వివాదాస్పదంగా వ్యవ‌హ‌రిస్తున్న కార్పొరేట‌ర్లకు టికెట్లివ్వబోమ‌ని ఖరాఖండిగా తేల్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా వెలువ‌డిన స‌ర్వే వివ‌రాల‌ను ఖ‌చ్చితంగా ఆయ‌న ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్నారు. ప్రజాబ‌లం లేని నేతలకు టికెట్లిచ్చి పార్టీకి న‌ష్టం చేకూర్చుకునే బ‌దులు మంచి స‌మ‌ర్థవంత‌మైన నేత‌ల‌కే టికెట్లివ్వాల‌ని ఆయ‌న భావిస్తున్నారని సమాచారం. అక్రమ వ్యాపారాలు, భూ దందాలు, ఇత‌ర పంచాయితీలు నిర్వహించే అధికార పార్టీ కార్పొరేట‌ర్ల జాబితా ఇప్పటికే మంత్రి వ‌ద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 15 నుంచి 18 మంది వ‌ర‌కు ఉన్నట్లుగా ఆ పార్టీ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. అంటే ఇప్పుడున్న టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల దాదాపు సంగం మందికి టికెట్లు ద‌క్కవ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

కాంగ్రెస్‌లో నూతనోత్సాహం..

ప‌లు డివిజ‌న్లలో టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లపై ప్రజ‌ల్లో వ్యతిరేక‌త ఉన్నట్లుగా కాంగ్రెస్ బ‌లంగా విశ్వసిస్తూ వ‌స్తోంది. ఇటీవ‌ల లీకైన స‌ర్వేలోనూ అదే విష‌యం వెల్లడికావ‌డంతో కాంగ్రెస్ పార్టీ అల‌ర్టయింది. ఆ పార్టీ నుంచి ఆయా డివిజ‌న్లలో టికెట్లు ఆశిస్తున్న నేత‌లు కొంత‌మంది ఇప్పుడు యాక్టీవ్ అయ్యారు. ప్రయ‌త్నించాల‌నే థృక్పథం వారిలో స్పష్టంగా క‌న‌బ‌డుతోంది. దీంతో కాంగ్రెస్‌ని కొద్దికాలంగా జిల్లాలో ముందుండి న‌డిపిస్తున్న వారికి ట‌చ్‌లోకి వెళ్తున్నారు. డివిజ‌న్ల వారీగా తాజా ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి చెబుతున్నార‌ని తెలుస్తోంది. డివిజ‌న్ల వారీగా పార్టీకి ఉన్న బ‌లాన్ని, పార్టీకి ఒన‌గూరే ప్రయోజ‌నాల‌ను ముఖ్య నేత‌ల వ‌ద్ద ఏక‌రువు పెడుతున్నట్లు స‌మాచారం. మొత్తంగా మునుపెన్నడూ లేని ఉత్సాహం ఇప్పుడు కాంగ్రెస్ కొట్టొచ్చిన‌ట్లుగా క‌న‌బ‌డుతోంద‌న్నది.

కొంతమందిపైనే సంతృప్తి

జ‌నాలు సంతృప్తి వ్యక్తం చేసిన జాబితాలో 12,13,14,16,17,27,29,46,47 డివిజ‌న్లకు చెందిన 9 మంది టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు ఉన్నారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యంలోని 37వ డివిజ‌న్‌ కార్పొరేట‌ర్, సీపీఐ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 28 డివిజ‌న్ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇందులో 12,13,14 డివిజ‌న్లకు చెందిన టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల ప‌నితీరుపై ప్రజ‌లు సంతోషం వ్యక్తం చేసిన‌ట్లుగా స‌ర్వేలో పేర్కొన‌డం విశేషం.


Next Story

Most Viewed