మహిళలకు నైట్ షిప్టులు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

by  |
మహిళలకు నైట్ షిప్టులు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు
X

తిరువనంతపురం: కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పువెలువరించింది. రాత్రిపూట పని చేయాల్సి ఉంటుందన్న కారణంగా అర్హులైన మహిళలకు ఉద్యోగాలు నిరాకరించవద్దని స్పష్టం చేసింది. కేవలం మహిళ అనే ఏకైక కారణంగా రిక్రూట్ చేసుకోకుండా ఉండరాదని వివరించింది. అన్నివేళలా మహిళలు సురక్షితంగా, నిర్భయంగా విధులు నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. అలాంటి వాతావరణం ఉంటే నైట్ షిఫ్టుల కారణంగా మహిళలను నిరాకరించే ఆలోచన ఉండదు కదా అని పేర్కొంది. కేరళ ప్రభుత్వ పరిధిలోని కేరళ మినరల్స్, మెటల్స్ లిమిటెడ్(కేఎంఎంఎల్) విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తోసిపుచ్చింది.

సేఫ్టీ అధికారి కోసం కేవలం పురుషులే దరఖాస్తు చేసుకోవాలన్న ఆ నోటిఫికేషన్ మహిళలకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను కాలరాస్తు్న్నదని వివరించింది. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కొల్లాంకు చెందిన ట్రీసా జోస్‌ఫైన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫ్యాక్టరీల చట్టం 1948 చేసినప్పుడు మహిళలు ఎక్కువ ఇంటిపనికే పరిమితమైన కాలమని, ఇప్పుడు ప్రపంచం చాలా పురోగమించిందని, ప్రస్తుతం మనదేశంలో మహిళలు అన్నిరంగాల్లోనూ తమదైన ముద్రవేస్తున్నారని జస్టిస్ అనుశివరామన్ వివరించారు. అన్ని రంగాల్లోనూ నిర్దిష్టమైన సమయం అని కాకుండా అన్నివేళల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. హెల్త్‌కేర్, ఏవియేషన్, ఐటీ సహా పలురంగాల్లో వారిపాత్ర ప్రముఖంగా కనిపిస్తు్న్నదని చెప్పారు. పిటిషనర్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని కేఎంఎంఎల్‌ను ఆదేశించారు.


Next Story