అత్యాచార నిందితుడికి కరోనా.. కోర్టు ఆగ్రహం

by  |
అత్యాచార నిందితుడికి కరోనా.. కోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఓ నన్‌ పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ కరోనా బారినపడ్డారు. తన లాయర్‌ కరోనా బారినపడటంతో బిషప్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. పరీక్షల అనంతరం ఆయనకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లు జలంధర్ నోడల్ అధికారి టీపీ సింగ్ తెలిపారు. కాగా, అత్యాచార ఆరోపణల కేసు విచారణకు బిషప్ సరిగా హాజరు కాకపోవడంపై కొట్టాయంలోని స్థానిక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఆయనకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయడంతో పాటు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.

ఈ నెల 1న కోర్టు విచారణకు హాజరు కాకుండా బిషప్ తప్పించుకున్నారు. జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లో ఉండటం వల్లే తాను హాజరు కాలేకపోయానని తెలిపారు. అయితే, ఆయన మాటల్లో వాస్తవం లేదని, జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్ ప్రాంతంలో లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఉద్దేశపూర్వకంగానే విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్పందించిన న్యాయస్థానం గతంలో మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయడంతో పాటు కొత్తగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది. కాగా, ఈ నెల 6న బిషప్ కరోనా టెస్టు చేయించుకున్నారు. ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. గొంతు నొప్పి, దగ్గు రావడంతో సోమవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది.

Next Story