కార్పొ‘రేట్’ వాటర్‌కు కేరళ చెక్!

by  |
కార్పొ‘రేట్’ వాటర్‌కు కేరళ చెక్!
X

కేరళలో తనదైన మార్క్ పాలనతో దూసుకెళ్తున్న సీఎం పినరయి విజయన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటర్ బాటిళ్ల ధరలపై కార్పొరేట్ కంపెనీల ఆగడాలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటూ ప్రజల జేబుకు చిల్లుపెడుతున్న ప్రైవేట్ కంపెనీలకు గట్టి స్టోక్ ఇచ్చారు. ఇష్టముంటే మంచినీళ్లు అమ్మండి లేకుంటే లేదన్నట్లుగా కౌంటర్ ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా వాటర్ బాటిల్ గరిష్ఠ ధర రూ.13గా నిర్ణయిస్తూ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా వాటర్ క్వాలిటీలో తేడాలొస్తే ఇక సహించేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రూ.13కే వాటర్ బాటిళ్లు అమ్మాలని ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పాడు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.20 నుంచి రూ.25‌కు అమ్మిన వాటర్ బాటిళ్లు ఇక నుంచి రూ.13కే ప్రజలకు అందనున్నాయి. సీఎం తీసుకున్న నిర్ణయంతో ప్రైవేట్ కంపెనీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రజల బాగోగులే ముఖ్యమని స్పష్టం చేశాడు. లీటర్ వాటర్ బాటిల్‌ను రూ.15కు అమ్ముకునేలా పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. వాటర్ బాటిల్ ఉత్పత్తికి రూ.6 ఖర్చు చేస్తుండగా రూ.2 రవాణా ఖర్చులు అవుతున్నాయని, దీన్ని పరిగణనలోకి తీసుకునే వాటర్ బాటిల్ ధరను గరిష్ఠంగా రూ.13కు నిర్ణయించామన్నారు. సర్కార్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రైవేట్ కంపెనీలు మాత్రం కోర్టుకెళ్లే యోచనలోఉన్నట్లు తెలుస్తోంది.

కేరళలో వాటర్ బాటిళ్లే కాక చాలా విషయాల్లో సీఎం ప్రజలను మేలు కలిగేలా నిర్ణయం తీసుకొని శభాష్ అనిపించుకున్నారు. ఇక మన తెలంగాణలో అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ప్రైవేట్ కంపెనీలు రెచ్చిపోయి రూ.30 వరకు వాటర్ బాటిళ్లను అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. కొన్ని నెలల క్రితం సినిమా థియేటర్లలో పోలీసులు దాడులు చేసి కొద్దిరోజులపాటు ధరలను అదుపులోకి తెచ్చినా హైదరాబాద్‌లో వాటర్ బాటిళ్ల దందా అలాగే కొనసాగుతోంది. అయితే కేరళలో ప్రభుత్వం తీసుకున్నట్లు మన దగ్గర కూడా గట్టి నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పినరయి డెసిషన్‌పై అటు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.

Next Story

Most Viewed