పసి మనసును గెలిచిన కేరళ ఖాకీలు..

by  |
పసి మనసును గెలిచిన కేరళ ఖాకీలు..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఎవరైనా పొరుగింట్లో నుంచి ఏదైనా ఖరీదైన వస్తువును దొంగిలించి, తమ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి. పొరుగింటి వారు ఆ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లు వెంటనే దొంగిలించిన వ్యక్తిపై చర్యలు తీసుకుని సదరు వస్తువును సంబంధితులకు అప్పజెప్తారు. కానీ ఇక్కడ కేరళ ఖాకీలు చేసిన పని చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఇంతకీ ఏం చేశారంటే..

కేరళ, పాలక్కడ్ సిటీకి దగ్గర్లోని షోలయుర్ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన ఆ బాలుడికి చిన్నప్పటి నుంచి కలలు కనడం అంటే ఇష్టం. తోటి విద్యార్థులతో కలిసి స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో తనకు సైకిల్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. తను కూడా ఇతరుల మాదిరి న్యూ బ్రాండ్‌ సైకిల్‌‌పై పాఠశాలకు వెళ్లాలనుకుని, అదే విషయాన్ని పేరెంట్స్‌కు చెప్పి సైకిల్ కావాలని అడిగాడు. ఆర్థిక పరిస్థితుల రిత్యా వారు తర్వాత కొనిస్తామని చెప్పారు. కానీ తనకంటూ సొంత సైకిల్‌ ఉండాలనే కోరిక ఆ బాలుడి మనసులో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో పొరుగింటివారు కొత్త సైకిల్ కొన్న విషయాన్ని గమనించిన బాలుడు.. దాన్ని దొంగిలించి తన ఇంట్లో పెట్టుకున్నాడు. దీంతో వారు పీఎస్‌లో కంప్లయింట్ చేయగా, పోలీసులు ఆ సైకిల్‌ను తిరిగి వారికి అప్పజెప్పారు. ఆ తర్వాత సైకిల్ ఎందుకు దొంగతనం చేశావ్? అని బాలుడిని ప్రశ్నించారు. అయితే ‘సైకిల్ మీద స్కూల్‌కు వెళ్లడం తన కల’ అని చెప్పడంతో పోలీసులు చలించిపోయారు.

ఆర్థిక పరిస్థితుల కారణంగానే తను ఇలా చేశాడని నిర్ధారించుకున్న షోలయుర్ సీఐ వినోద్ కృష్ణ బృందం.. ఒక కొత్త సైకిల్ కొని, బాలుడికి అందజేశారు. కాగా తమ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్, పోలీసులు బాలుడికి సైకిల్ అందజేయడం పట్ల అతడి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అవుతోంది. ‘మనసున్న ఖాకీలు, బాలుడి హృదయం గెలుచుకున్న పోలీసులు, మానవత్వమున్న పోలీసు బృందం’ అంటూ పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed