నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

by  |
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజారోగ్యానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ప్రజల వైద్యానికి పెద్దపీటవేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీ దవాఖానాలు నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. ప్రొటీన్ తో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ, ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు.. ప్రభుత్వం.. మాంసం, చేపల వినియోగాన్ని పెంచే పథకాలను అమలు చేస్తున్నదన్నారు. మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు తదితర పౌష్టికాహార సరఫరాను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా శాఖాహార, మాంసాహార మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే అమలు పరుస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్వచ్ఛ కార్యక్రమాలతో పలు జాతీయ అవార్డులు పొందడం జరిగిందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సునిశితంగా పనిచేస్తున్నదనడానికి నిదర్శనమన్నారు. గత ఏడాది కాలంగా కరోనా కష్టకాలాన్ని తెలంగాణ తట్టుకొని నిలబడడానికి ప్రజల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని తెలిపారు. రోగ నిరోధక శక్తి స్థాయి పెరగడానికి పోషకాలు కలిగిన ఆహారం దోహద పడ్డాయన్నారు.

మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం సరఫరా చేస్తుండటంతో ప్రజలను రోగాల నుంచి కాపాడుతున్నారని చెప్పారు. తల్లీ, బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతమై, మాతా శిశు సంక్షేమం మెరుగుపడిందన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గిపోయి, బాల్య ప్రసవాలకు అడ్డుకట్ట వేసినట్లయిందన్నారు.

కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పౌష్టికారం తీసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. నిరంతరం ఆరోగ్యంపై దృష్టి నిలపడం ద్వారా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.


Next Story