కేసీఆర్ అవినీతి పాలనపై యుద్ధం చేస్తాం : రాజాసింగ్

by  |
Praja Sangram Yatra
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి పాలనను అంతమొందించేందుకు యద్ధం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శుక్రవారం భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజాసంగ్రామ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని ప్రకటించారు. టీఆర్ఎస్ నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా 2023 ఎన్నికల వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్య పరిచేలా చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లను చేపట్టేందుకు 29 కమిటీలను నిర్వహించామని పేర్కొన్నారు.

పాతబస్తీని కేసీఆర్ ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని, అధికారం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను సిగ్గు లేకుండా సంతల్లో పశువుల్లా కొంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే దళిత బంధు పేరిట హుజూరాబాద్‌లో రూ. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, పేదలు ఉన్నారని వారికోసం ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాజీనామా చేస్తేనే దళిత బంధు పథకం అమలవుతుందనుకుంటే రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రాజాసింగ్ తోపాటు బీజేపీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ జి. మనోహర్ రెడ్డి, వీరేందర్ గౌడ్, శంకర్, దీపక్ రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్, బాబూమోహన్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శులు జయశ్రీ, కుంజా సత్యవతి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed