ఖాళీలు తేలేనా?.. కొలువుల భర్తీపై నీలి నీడలు

by  |
ఖాళీలు తేలేనా?.. కొలువుల భర్తీపై నీలి నీడలు
X

‘రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం’ అంటూ గతేడాది డిసెంబర్​ 13న సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. కనీసం రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే లెక్క తేలలేదు. మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎస్​.. ఉద్యోగుల విభజనపై చర్చించారు. ముందుగా కేడర్​ స్ట్రెంత్​ తేల్చాలని, సీనియార్టీ అంశంలో పాత ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలంటూ డిమాండ్​ పెట్టారు. ఆ తర్వాతే ఖాళీల జాబితా వస్తుందంటూ సూచించారు. దీంతో ఇప్పుడు ఖాళీల సంఖ్య తేలాలన్నా.. నోటిఫికేషన్లు రావాలన్నా మరిన్ని రోజులు ఆగాల్సిందేనని తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : గతేడాది మండలి ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్​ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు మంత్రులు, అధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎట్టకేలకు కొత్త జోన్లకు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేడర్​ను విభజన చేసింది. జిల్లాల వారీగా పోస్టుల భర్తీపై ఇంకా అసమగ్రంగానే ఉంటున్నది. పాత జిల్లాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పాటైన జిల్లాలవారీగా ఆర్డర్​ టు సర్వ్​తో విధులు అప్పగించారు. కొత్త పోస్టులను క్రియేట్​ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జోనల్​ విధానం ప్రకారం విభజన తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు ఆఫ్షన్ల ప్రక్రియను ముందేసుకున్నారు.

ఖాళీల గుర్తింపునకు బ్రేక్​

పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఖాళీలు ఉంటే ప్రభుత్వం 56 వేలకే పరిమితం చేసింది. పాత ఉద్యోగులను జోన్లవారీగా సర్దుబాటు చేసిన తర్వాతే పూర్తిస్థాయి నివేదిక వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉద్యోగులందరి నుంచీ ఆప్షన్లు తీసుకోనున్నారు. ఆ తర్వాత వారి పోస్టింగ్​ ప్రాంతాన్ని బేరీజు వేసుకుని స్థానికతను తేల్చనున్నారు. అనంతరం బదిలీలు చేపడుతారు. మరోవైపు జిల్లా, జోనల్​, మల్టీజోన్లవారీగా ఉద్యోగుల విభజనకు ముందే నూతన జిల్లాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులను మంజూరు చేయాలని, అనంతరమే బదిలీలకు ఆప్షన్లు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు. 2016లో అమలు చేసిన ఆర్డర్​ టు సర్వ్​ను రద్దు చేయాల్సిందేననే ప్రతిపాదన తెచ్చారు. పాత జిల్లాల వారీగా జోనల్​ సీనియార్టీని కొనసాగించాలని, 2018 తర్వాత జోనల్​ వ్యవస్థకు ఆమోదం రావడంతో ఆ తర్వాత అపాయింట్​ అయిన ఉద్యోగులకు మాత్రమే కొత్త జోనల్​ వర్తింపచేయాలంటూ ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సాంకేతిక సమస్యలు వచ్చేనా?

పాత ఉద్యోగులకు కొత్త జోనల్​ విధానంలోని సీనియార్టీ కాదని, పాత జిల్లాలవారీగా వర్తింపచేయాలనీ ఉద్యోగ సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం కొత్త జోనల్​, మల్టీజోనల్​ వ్యవస్థనే పరిగణలోకి తీసుకుంటున్నది. దీని ప్రకారమే పోస్టుల విభజన చేసింది. ఈ నేపథ్యంలో పాత సీనియార్టీ ప్రకారం చేయాలంటే మరో జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. దీనిపై సీఎస్​ నుంచి ఎలాంటి ఆమోదం రాలేదు. ఒకవేళ పాత సీనియార్టీ ని కాదని కొత్త జోనల్​ ప్రకారం వర్తింపచేస్తే ఉద్యోగులు కోర్టుకు వెళ్లే చాన్స్ ఉంది. ఈ సాంకేతిక సమస్యలను ఎలా గట్టెక్కించాలనేదే అధికారుల ముందున్న సవాల్​.

ఎన్నాళ్లో ఎదురుచూపులు

ప్రస్తుతం రాష్ట్రంలో 26 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం, మంత్రులతో సహా అంతా త్వరలోనే నోటిఫికేషన్లు అంటూ ఊరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా ఉద్యోగాల ఖాళీలు తేలడం లేదు. మరోవైపు సోమవారం నుంచి జిల్లా, జోనల్​ వారీగా ఉద్యోగులకు ఆఫ్షన్లు ఇచ్చేందుకు అధికారులు ముసాయిదా సిద్ధం చేశారు. 18 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నా.. పాత ఉద్యోగుల సీనియార్టీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముందుగా ఆర్డర్​ టు సర్వ్​ను రద్దు చేసి, కేడర్​ స్ట్రెంత్​ ఖరారు చేసి, పాత జిల్లాలవారీగా సీనియార్టీని వర్తింపచేయాలని ఉద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రభుత్వానికి తలనొప్పిగా మారనున్నది. ఖాళీల లెక్క తేల్చి, నోటిఫికేషన్లు ఇస్తారని ఆశపడుతున్న నిరుద్యోగులకు మరింత కాలం వెయిట్​ చేయక తప్పదు.

Next Story

Most Viewed