రేవంత్ రెడ్డా.. కోమటిరెడ్డా..?

by  |
రేవంత్ రెడ్డా.. కోమటిరెడ్డా..?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మార్పు కోసం గత కొద్దికాలంగా ఆ పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఢీకొట్టగల ధీటైన నాయకునికి పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అధిష్ఠానం. దీనిని దృష్టిలో పెట్టుకున్ననేతలు అధిష్ఠానం మనసు చూరగొనడానికి తమదైన శైలిలో కార్యక్రమాలు చేస్తూ తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. ఒకరు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే కార్యక్రమం చేపడుతుండగా, మరో నాయకుడు రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అది తమదే అన్నట్లు భావించి ముందుకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డిని మార్చే విషయంపై ఆరు నెలలుగా పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ బలపడాల్సిందిపోయి రాష్ట్రంలో రోజురోజుకూ తమ బలం సన్నగిల్లుతుండడంతో అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలను తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని గాడీలో పెట్టగల సత్తా ఉన్న నాయకుని పీసీసీ కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తానే సమర్ధుడినంటే తానే మొనగాడినంటూ డజన్లకొద్దీ నాయకులు పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీ దృష్టిలో పడడానికి రాష్ట్రంలో నాయకులు జోరుగానే కార్యక్రమాలు మొదలు పెట్టారు.

ఎవరి ప్రయత్నం వారిదే..
పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నాయకుల తంటాలు అన్నీఇన్నీ కావు. దారి ఏదైనా ఫర్వాలేదు, గమ్యం చేరుకోవడమే ముఖ్యమన్నట్లుగా వారి ప్రయత్నాలు సాగుతున్నాయి. దీని కోసం అధిష్టానం వద్ద ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం మెప్పు పొందడానికి రోజుకో కార్యక్రమంతో మీడియా మందుకు కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పనితీరును, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలిని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ వస్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డికి మొదట పీసీసీ ఇవ్వడానికి అధినాయకులు సిద్ధమైనప్పటికీ కొన్ని కారణాల వల్ల తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా పీసీసీ పదవి సాధించాలన్న లక్ష్యంతో రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎండగట్టే ప్రయత్నంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దీటుగా ‘పట్నం గోస’ అనే నిరసన కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వం పనితీరు దుమ్ము ఎత్తిపోస్తున్నారు. ఇంకా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్రం మొత్తం కలియ తిరుగుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కేంద్రమంత్రులతో చర్చించే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ పార్లమెంట్ నియోజకవర్గం పరిధికే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికి ప్రమాదం వచ్చినా అక్కడ వాలిపోతూ అందరి దృష్టిని తమవైపు మళ్లించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలంటూ ఢిల్లీ పెద్దలతో చర్చించారు. వయస్సు పైబడినప్పటికీ తమ దైనశైలిలో అధిష్టానం గుర్తింపు కోసం రోజుకో కార్యక్రమంతో కార్యకర్తలతో కలిసిపోతూ వార్తల్లో కనిపిస్తున్నారు వీహెచ్. చూడాలి మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో.. ఎవరికి పీసీసీ కుర్చీ దక్కుతుందో!

Next Story

Most Viewed