వారంలోనే కేసీఆర్ యూటర్న్!

by  |
వారంలోనే కేసీఆర్ యూటర్న్!
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు బిడ్డలు పుట్టరు.. ఈ సామెత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి కరెక్ట్‌గా సూటవుతోంది. ‘వరద బాధితుల నోటికాడి ముద్దను బీజేపొళ్లు చెడగొట్టిన్రు. రిజల్ట్ వచ్చిన రెండ్రోజులకే మళ్లీ డిసెంబర్ 7నుంచి వరద సాయాన్ని కంటిన్యూ చేస్తాం. మీరు ఖచ్చితంగా ఓటుతో టీఆర్ఎస్ పార్టీనే ఆశీర్వదించాలి. ఇంకా భవిష్యత్‌లో మంచి పనులు చేస్తాం’.. గ్రేటర్ ప్రచారంలో భాగంగా ఎల్బీస్టేడియం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్ కూడా వచ్చింది, వరద సాయం మాత్రం అందరికీ రాలేదు. దీంతో రాష్ట్రం నడిబొడ్డున 4కోట్ల ప్రజల సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఉత్త ముచ్చటైంది. వరదసాయంపై కేసీఆర్ హామీ యూటర్న్‌ తీసుకున్నట్టయ్యింది.

గ్రేటర్ ఎన్నికల షెడ్యూలుకు కేవలం రెండ్రోజుల ముందు నుంచే మీసేవా కేంద్రాల ద్వారా సాయాన్ని అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఒక్కరోజు మాత్రమే ఖాతాల్లో డబ్బులు వేసి బాధితుల్లో కొత్త ఆశలు కల్పించింది. కానీ మరుసటి రోజే ఈసీ జోక్యం చేసుకోవడం, సాయాన్ని ఆపాలని చెప్పడం జరిగిపోయింది. దీంతో లక్షల సంఖ్యలో అర్జీలు పెట్టుకున్న వరద బాధితుల నోట్ల మన్ను పడ్డట్టయ్యింది. ఇంత నిరాశలో ప్రజలకు మళ్లీ ఆశలు రేకెత్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత అందిరికీ సాయం చేస్తామని ప్రకటించారు. ఫలితాలు వచ్చిన తర్వాత బాధితులను పక్కన పెట్టి సిద్దిపేట, ఢిల్లీ పర్యటనలు చేసిన కేసీఆర్.. గ్రేటర్ వరద బాధితులకు సాయంపై కనీసం రివ్యూ చేసిన దాఖలాలు కనపడకపోవడం గమనార్హం.

మొదట్లో 6లక్షల మంది అర్జీలు పెట్టుకుంటే, రెండ్రోజుల్లో రెండున్నర లక్షల మందికి సాయాన్ని అందించిన సర్కార్.. రెండోదఫాలో కేవలం 30వేల లోపు బాధితులకే సాయాన్ని అందించినట్లు తెలుస్తోంది. అదికూడా మొదటి దఫాలో దరఖాస్తుచేసుకున్న వారికే ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. వరద బాధితులు ఎన్నిసార్లు అధికారులను కలిసినా మాటను దాటివేస్తూ.. అస్పష్ట సమాధానం చెప్పడంతో ఇక వరద సాయం ‘కల’గానే మిగిలిపోయింది. హైదరాబాద్‌లో 6లక్షమందికి పైగా వరద బాధితులు ఉంటే.. సగం మందికి కూడా సాయం అందకపోవడంతో అసలు ప్రభుత్వం ప్రకటించిన రూ.550 కోట్లు ఎవరు తిన్నారన్న ప్రశ్నలు బాధితుల నుంచి తలెత్తుతున్నాయి.

వరద సమయంలో డైరెక్టుగా బాధితులకే రూ.10వేలు ఇచ్చే కార్యక్రమంలో.. నిధులన్నీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులే తిన్నారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలకు.. కేసీఆర్ హామీ ఇచ్చి యూటర్న్‌ తీసుకోవడం పుండుమీద కారం చల్లినట్లుగా తయారైంది. ఇప్పటికీ బల్దియా అధికారులు వరదసాయంపై ఇంట్రెస్ట్ చూపకపోవడం, అసలు వరద సాయం నిధులు ఉన్నాయా? లేవా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. చూస్తుంటే.. మూడ్రోజులు పనులకు వెళ్లకుండా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకొని మీసేవా దగ్గర క్యూలో నిల్చున్నవారి పరిస్థితి ‘అచ్చిరాని కాలానికి అడుక్కుతినపోతే చేతిలున్న చిప్ప ఊడిపోయినట్లుగా’ మారింది. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు రావడం వల్లే వరద సాయాన్ని సీఎం కేసీఆర్ అటెకెక్కించారన్న విమర్శలూ లేకపోలేదు.



Next Story

Most Viewed