ఎన్నికలోస్తున్నాయనే దళితబంధు పథకం– బండి సంజయ్

by  |
ఎన్నికలోస్తున్నాయనే దళితబంధు పథకం–  బండి సంజయ్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: హుజురాబాద్ ఎన్నికలోస్తున్నాయనే రాష్ట్రంలో దళితబంధు పథకం తెచ్చారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చిలుకూరు నుంచి మొయినాబాద్ వరకు సాగింది. ఈ యాత్రలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో పాల్గోన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభించారని పాత్రో విమర్శించారు.

ఎన్నికలోచ్చినప్పుడే పథకాలు, ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గతంలో సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరుపుతామని ప్రకటించి మాట తప్పారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించేవరకు ప్రతి కార్యకర్త బండి సంజయ్‌కు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.

నీకుటుంబంలో పదవులు కోల్పోతే తిరిగి పదవులిస్తున్నావ్.. మరి నిరుద్యోగులకు ఉపాధి ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నోటీఫికేషన్లు ఎందుకు వేయడం లేదని అన్నారు. పోరాడిన తెలంగాణలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫీయాతో పరిపాలన సాగుతుందన్నారు. రాష్ట్ర పరిపాలనకు నిలయమైన సచివాలయానికి రాకుండా కేవలం ఫాంహౌజ్‌కే పరిమితమై పాలన సాగించే కేసీఆర్ వంటి నేతలను దేశంలో ఎక్కడ చూడలేదని విమర్శించారు.

san

రంగారెడ్డి జిల్లాలోని 111 జీవోను ‘ట్రిపుల్ మెన్’ జీవోగా సీఎం కేసీఆర్ తయారు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ట్రిపుల్‌మెన్ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేనని వివరించారు. సీఎం కేసీఆర్ 111 జీవోకు మద్దతు ఇస్తాడో.. లేదో స్పష్టం చేయాలని బండి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఫాంహౌజులున్నాయి.. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు.

అదే పేద, మధ్యతరగతి కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదని బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదేనన్నారు. వ్యాక్సిన్ వేసుకోమని ఇప్పటి వరకు ప్రజలకు పిలుపునివ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరే మాత్రమేనని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో వరదలు వస్తే పేదలకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీనే అన్నారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సహాయం చేస్తానన్న ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చాడో చెప్పాలన్నారు. రంగారెడ్డి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం రూ.1‌‌040 కోట్ల నిధులను మంజూరు చేసిందని బండి సంజయ్ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్, బియ్యం, హరితహారం, రోడ్లకు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల వాటా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేపట్టే సంక్షేమ పథకాలపై కేసీఆర్ ఫోటోలు పెట్టుకోని ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సీఎం కేసీఆర్, దళిత బంధు ఇస్తానంటే మనం నమ్ముతామ అని అన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.

ఎంఐఎం వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వస్తా.. దారుస్సలాం రమ్మనా వస్తా.. ఛాలెంజ్ చేస్తున్నా.. మా మోడీని ఛాలెంజ్ చేస్తే.. ఏం చేయాలో అది చేశాం.. ఏమైనా చేస్తాం..’’ అని బండి సంజయ్ అన్నారు. పాతబస్తీలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కూడా టీఆర్ఎస్‌కు లేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరే నిర్వహిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన గడ్డ .. రంగారెడ్డి జిల్లా అని ఆయన గుర్తు చేశారు.


Next Story

Most Viewed