‘కేసీఆర్ మోసపూరిత మాటలు మానివేయాలి’

by  |
‘కేసీఆర్ మోసపూరిత మాటలు మానివేయాలి’
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమై పోతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఖైరతాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలందరికి ప్రభుత్వ వైద్యం అందాలనే ఉద్దేశంతో 2014 సంవత్సరంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రూ.10 కోట్లతో అన్ని రకాల వసతులతో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆసుపత్రిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఖైరతాబాద్ లోని బడాగణేష్ వద్ద ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లతో కలిసి పరిశీలించారు.

అనంతరం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ హాస్పిటల్ లో కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా అన్ని రకాల వసతులు, వైద్య పరికరాలు, బెడ్లు, డాక్టర్లు, నర్సులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు మాత్రం ఇన్-పేషెంట్ వైద్యం అందడం లేదన్నారు. గత సంవత్సరం నుండి కరోనాతో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెస్ మక్త, బిఎస్ మక్త వంటి అనేక ప్రాంతాల పేద ప్రజలు వైద్యం అందక, బెడ్లు లేక కరోనాతో చనిపోతున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిని ఎందుకు కొవిడ్ ఆసుపత్రిగా మార్చి పేద ప్రజలకు వైద్యం అందించడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉస్మానియా ఆసుపత్రి విషయంలో కూడా సీఎం కేసీఆర్ ఇలానే మాట్లాడారని, ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత మాటలు మాట్లాడడం మానివేయాలని, అన్ని రకాల వసతులు ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో వెంటనే పేద ప్రజలందరికీ ఇన్-పేషెంట్ వైద్యం మొదలుపెట్టి కరోనా వైద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed