కేసీఆర్ కుటుంబ పాలన అంతమే లక్ష్యం : ఎంపీ ధర్మపురి అరవింద్

by  |
Arvind
X

దిశ, డిండి: నీళ్లు, నిధులు, నియామకాలు ఎజెండాతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రస్తుతం ఒక్క కేసీఆర్ కుటుంబ పాలనలోనే చిక్కిందని, కుటుంబ పాలన అంతమే మన లక్ష్యమని నిజామాబాద్ ఎంపీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లి తిరుగు ప్రయాణంలో శుక్రవారం మార్గమధ్యలో డిండి ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.

కేంద్రం నిర్వహించిన జల వివాదాల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు పాల్గొనడం లేదో తెలంగాణ ప్రజలకు సీఎం తెలియజేయాలని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్‌కు మధ్య ఉన్న అంతర్గత ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పేరుతో రైతుల భూములు తీసుకొని ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని, వెంటనే రైతులకు భూముల పైసలు అందించాలన్నారు.

సిద్దిపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ రాధికా కృష్ణ, నాయకులు నల్లగంతుల వెంకటయ్య, సింకారు సైదా, గాయాల రాఘవేందర్, వంశీ, రమేష్, అంజి, సంతోష్ చారి, పాండు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed