ఉద్యమ కేసులో కోర్టుకు హాజరైన కవిత

by  |
ఉద్యమ కేసులో కోర్టుకు హాజరైన కవిత
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ హాజరయ్యారు. 2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కవిత ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సందర్భంగా ఉపఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా ఆమె నిజామాబాద్ పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు. అయితే, సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదుట ధర్నా చేసిన కారణంగా ఐపీసీ 341, 188, సెక్షన్లు కింద పోలీసులు కేసును నమోదు చేశారు. దాంతో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం, స్పెషల్ సెషన్స్ జడ్జి ఎదుట హాజరు కావాలంటూ ఇటీవల సమన్లు జారీ చేసింది. కేసును విచారించిన మొదటి అదనపు న్యాయమూర్తి, వ్యక్తిగత పూచీకత్తు పదివేల రూపాయల బాండ్ సమర్పించాలనీ, తిరిగి 19మార్చి నాడు హాజరు కావాలని ఆదేశించారు.

Next Story

Most Viewed