ఈటలకు కొత్త టెన్షన్.. కేటీఆర్‌తో కౌశిక్ రెడ్డి భేటీ..

by  |
ఈటలకు కొత్త టెన్షన్.. కేటీఆర్‌తో కౌశిక్ రెడ్డి భేటీ..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదుపేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్న ప్రచారం కూడా గుప్పుమంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడుతుండటంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది.

హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే ఆయన మాత్రం మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేస్తూ వస్తున్నారు. కానీ అనూహ్యంగా కౌశిక్.. కేటీఆర్‌తో భేటీ కావడం, ఆయన కారులో వెళ్తుండగా చెవిలో గుసగుసలు పెడుతున్న ఫోటోలు కూడా బయటకు రావడంతో.. వారిద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కౌశిక్ రెడ్డి.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా రాయబారం పంపినట్టు కూడా ప్రచారంలో ఉంది. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులను కూడా ఆయన కలిసి.. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తే గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నానని కూడా చెప్పినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

congress kaushik reddy

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేసిన కౌశిక్ రెడ్డి ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పుడు కౌశిక్ రెడ్డి 62 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఓ దశలో ఎన్నికల్లో.. కౌశిక్ గెలుస్తాడా.? అన్న పరిస్థితి కూడా కనిపించింది. తాజాగా ఈటల రాజేందర్ ఎపిసోడ్‌తో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా బలమైన నాయకుని కోసం ఆరా తీస్తున్న క్రమంలో కౌశిక్ రెడ్డి.. కేటీఆర్‌ను కలవడంతో ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిస్తే తన బలంతో పాటు.. పార్టీ అండదండలు ఉంటే కచ్చితంగా తాను గెలుస్తానన్న ఆలోచనలో ఉన్నాడని కూడా కొందరు అంటున్నారు.

కాంగ్రెస్ నుండే పోటీ చేస్తా : కౌశిక్ రెడ్డి

తాను టీఆర్ఎస్‌లో చేరేది లేదని కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో నిలుస్తానని వెల్లడించారు. సోషల్ మీడియాలో కేటీఆర్‌తో భేటి గురించి పెద్ద సంఖ్యలో పోస్టింగ్‌లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఓ మిత్రుని తండ్రి మరణించడంతో పరామర్శకు వెళ్లినప్పుడు.. అక్కడకు వచ్చిన కేటీఆర్‌తో మాట్లాడానే తప్ప.. తాను టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేది లేదని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed