కౌశిక్​రెడ్డికి గవర్నర్​ కోటా ఎమ్మెల్సీకి ఆమోదం.. TRSలో మొదలైన ఉత్కంఠ

by  |
కౌశిక్​రెడ్డికి గవర్నర్​ కోటా ఎమ్మెల్సీకి ఆమోదం.. TRSలో మొదలైన ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్​ఎస్​ నేత పాడి కౌశిక్​రెడ్డికి గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ పదవికి ఆమోదం పడింది. రాష్ట్ర కేబినెట్​ ప్రతిపాదనను గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సోమవారం ఆమోదించారు. దీంతో కౌశిక్​రెడ్డికి ఎమ్మెల్సీ హోదా వచ్చింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇక హుజురాబాద్​ నుంచి ఎవరికి టికెట్​ వస్తుందనే ఉత్కంఠ మొదలైంది. రెడ్డి వర్గానికి ఈ పదవి రావడంతో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ పరిణామాలు టీఆర్​ఎస్​ నేతలకు బంపర్​ ఆఫర్లు తీసుకువస్తోంది. ఇప్పటికే హుజురాబాద్​ నియోజకవర్గాన్ని నిధులతో నింపుతుండగా… పార్టీ నేతలకు కూడా పదవులు వస్తున్నాయి. అయితే ఈటలను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న కౌశిక్​రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్​ పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గత నెల 21న టీఆర్​ఎస్​లో చేరారు. ఈ నేపథ్యంలో ఆదివారం కేబినెట్​ భేటీలో కౌశిక్​రెడ్డికి గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించి, గవర్నర్​కు ప్రతిపాదించారు. టీఆర్​ఎస్​లో చేరే సమయంలోనే కౌశిక్​రెడ్డిపై సీఎం కేసీఆర్​ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఆయనకు ఏదైనా కార్పొరేషన్​ చైర్మన్​ ఇస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా కౌశిక్‌రెడ్డికి పదవి దక్కటం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవిపై పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో టీఆర్​ఎస్​ పార్టీ కార్యదర్శి, తెలంగాణ భవన్​ కార్యాలయ ఇంచార్జ్​ శ్రీనివాస్​రెడ్డికి ఈ పదవి ఉండగా.. ఇప్పుడు కౌశిక్​రెడ్డికి దక్కింది.

కాగా త్వరలో ఉప ఎన్నిక జరిగే హుజురాబాద్​ సెగ్మెంట్​కు వరుసగా రెండో పదవి దక్కింది. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్​ చైర్మన్​గా హుజురాబాద్​కు చెందిన బండా శ్రీనివాస్​ను నియమించారు. తాజాగా అదే సెగ్మెంట్​కు చెందిన కౌశిక్​రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ప్రస్తుతం కేసీఆర్​కు హుజురాబాద్​ ప్రతిష్టాత్మకం కావడంతో ఇంకా ఎవరికైనా పదవి వస్తుందనే ఆశల్లో ఉన్నారు.

హుజురాబాద్​ బరిలో ఎవరు

హుజురాబాద్​ టికెట్​ కోసం టీఆర్​ఎస్​లో పోటీ పెరిగింది. ఇటీవల మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి, కాంగ్రెస్​ పార్టీ ఆర్గనైజింగ్​ సెక్రెటరీ స్వర్గం రవితో పాటు పలువురు టీఆర్​ఎస్​లో చేరిపోయారు. అయితే టికెట్​ కోసం ఈ వలస నేతలతో ఏండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారు కూడా అధిష్టానం దగ్గర విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం రెడ్డి వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో… ఇక బీసీ వర్గానికి టికెట్​ ఇస్తారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో టికెట్​ పోటీలో గెల్లు శ్రీనివాస్​, స్వర్గం రవి, పొనగంటి మల్లయ్య, బీసీ కమిషన్​ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్​తో పాటు కనుమల్ల విజయ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed