స్వలింగ సంపర్కుల ‘కర్వా చౌత్’.. ఇంతకు మించిన దరిద్రం లేదంటూ నెటిజన్ల ఫైర్

by  |
స్వలింగ సంపర్కుల ‘కర్వా చౌత్’.. ఇంతకు మించిన దరిద్రం లేదంటూ నెటిజన్ల ఫైర్
X

దిశ, ఫీచర్స్ : ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత నాలుగో రోజు ‘కర్వా చౌత్’ జరుపుకోవడం సాంప్రదాయం. తమ భర్త క్షేమం కోరుతూ మహిళలు ఆ రోజంతా పార్వతీ దేవికి ఉపవాసముంటే.. పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త రావాలని ఉపవాస దీక్ష చేస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్.. వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లోని మహిళలు ఎక్కువగా జరుపుకునే ఈ పండగకు విభిన్న నేపథ్యాలు ఉండగా, ఈ రోజు వారంతా పెళ్లికూతుళ్లలా ముస్తాబవుతారు. అయితే ఈ పండుగ సందర్భంగా డాబర్ కంపెనీ స్వలింగ సంపర్కుల నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేయగా.. మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

అక్టోబరు 22న విడుదలైన డాబర్‌ కంపెనీకి చెందిన బ్యూటీ ప్రొడక్ట్ ‘ఫెమ్’ వాణిజ్య ప్రకటనలో ఇద్దరు మహిళలు తమ మొదటి కర్వా చౌత్‌కు ఎంతో సంతోషంతో సిద్ధమయ్యే క్రమంలో ఒకరికి ఒకరు గోల్డ్ బ్లీచ్‌ చేసుకుంటారు. ఈ క్రమంలో ‘కర్వా చౌత్’ పండుగ ప్రాముఖ్యత గురించి చర్చిస్తూ.. తమ భాగస్వామి కోసం ఎందుకు ఉపవాసం పాటిస్తున్నారో వివరిస్తారు. మరో మహిళ ఈ ఇద్దరికీ పండుగ రోజు రాత్రి ధరించే కొత్త బట్టలను అందిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు మహిళలు చంద్రుడిని జల్లెడలో చూసి, ఒకరి ముఖాలను మరొకరు చూసుకోవడంతో ఒకరి కోసం మరొకరు ఉపవాసం ఉన్నారని, వారు భాగస్వాములని అర్థమవుతుంది. క్లిప్ చివర్లో ‘గ్లో విత్ ప్రైడ్’ హ్యాష్‌ట్యాగ్‌తో రెయిన్‌బో రంగులతో రూపొందించిన డాబర్ బ్యూటీ బ్రాండ్ ‘ఫెమ్’ లోగోతో వీడియో ముగుస్తుంది. ఇంద్రధనస్సు జెండా LGBTQIA+ సామాజిక ఉద్యమానికి ప్రతీక అనేది తెలిసిన విషయమే.

ఈ ప్రకటన విడుదలైన నాటి నుంచి కొందరు బ్రాండ్ చొరవకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు దీనిని విమర్శిస్తున్నారు. అసలు ఇద్దరు మహిళలు కర్వా చౌత్ చేసుకోవడం సంప్రదాయ విరుద్ధమని, ఇది ఆచారాలను మంటగలిపే ప్రయత్నమని మండిపడ్డారు. హిందూ పండుగను లక్ష్యంగా చేసుకుని మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం ఫ్యాషన్ అయిపోయింది ఫైర్ అయ్యారు. హిందూ పండుగలను టార్గెట్ చేసి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్న బ్రాండ్ కంపెనీలు క్రిస్టియన్, ముస్లిం ఫెస్టివల్స్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక సాంప్రదాయక స్ట్రెయిట్ కపుల్ మాదిరిగా ‘గే/లెస్బియన్‌’లు తమ భాగస్వామి కోసం ఉపవాసం ఉండటం, కర్వా చౌత్ చేసుకోవడం నిజంగా ఆనందంగా ఉందంటున్నారు మరికొందరు నెటిజన్లు.

TVC Ceat టైర్స్ ప్రకటనలో నటుడు అమీర్ ఖాన్.. వాహనాలకు హాని కలిగించే విధంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చవద్దని ప్రజలకు సలహా ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఫైర్ అయిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే.. ‘నమాజ్ పేరుతో రోడ్లను బ్లాక్ చేయడం, అజాన్ సమయంలో మసీదుల నుంచి వెలువడే శబ్దం’ గురించి కూడా పరిష్కారాలు చూపుతూ యాడ్ రూపొందించాలని Ceat CEOను సోషల్ మీడియా ద్వారా అడిగాడు. ఇక గతంలో క్లాత్ బ్రాండ్ ఫ్యాబ్ ఇండియా, జ్యువెల్లరీ బ్రాండ్ తనిష్క్‌లు కూడా ఇలాంటి వివాదాలే ఎదుర్కొన్నాయి.


Next Story