కరూర్ వైశ్యా బ్యాంక్ లాభాలు వృద్ధి

by  |
కరూర్ వైశ్యా బ్యాంక్ లాభాలు వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్(KVB) నికర లాభం 81.4 శాతం పెరిగి రూ. 114.89 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 63.33 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 1,666.26 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 1,815.24 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయం 9.3 శాతం తగ్గి రూ. 1,537.51 కోట్ల నుంచి రూ. 1,394.70 కోట్లకు చేరుకుంది.

సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(NPA) 7.93 శాతానికి క్షీణించడంతో బ్యాంకు ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌పీఏలు 8.89 శాతంగా నమోదయ్యాయి. విలువ పరంగా స్థూల ఎన్‌పీఏలు(Bad loans) రూ. 3,998.43 కోట్లకు తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 4.50 శాతం నుంచి 2.99 శాతానికి మెరుగయ్యాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రోజూవారీ కార్యకలాపాలు, వ్యాపారం, ద్రవ్యతతో పాటు తగినంత మూలధనాన్ని పరిశీలిస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేర్లు 1.43 శాతం ఎగిసి రూ. 31.85 వద్ద ట్రేడయింది.


Next Story

Most Viewed