కరోనా.. ఐపీఎల్‌ జరిగేనా ?

by  |
కరోనా.. ఐపీఎల్‌ జరిగేనా ?
X

ఇండియాలో క్రికెట్ ఫీవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఐపీఎల్ సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ను మాత్రం వదలరంటే దీనికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ జరిగినన్ని రోజులూ జరిగే బెట్టింగుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయని కూడా ప్రచారంలో ఉంది. అయితే క్రికెటర్లకు, బీసీసీఐకి కాసులు కురిపించడంతో పాటు అభిమానులను థ్రిల్‌కు గురిచేసే ఐపీఎల్ మెరుపులు ఈ ఏడాది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ఐపీఎల్‌‌ను కూడా వదలడం లేదు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే 31 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇరాన్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణీకులకు విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే వారిని క్వారంటైన్ సెంటర్లకు పంపిస్తున్నారు. ఐపీఎల్‌లో ఆడేందుకు కూడా ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల నుంచి క్రికెటర్లు భారత్‌కు వస్తారు. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచాలనే నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్లు వస్తారా..? రారా అన్నది తేలాల్సి ఉంది. కివీస్ క్రికెట్ బోర్డు ఒకడుగు ముందుకు వేసి తమ ఆటగాళ్లపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కరోనా భయంతో ఈ నగరాల్లో సభలు, సమావేశాలు, స్కూల్ డే ఫంక్షన్లు రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఒక్కో మ్యాచ్‌కు 30 నుంచి 50 వేల మంది హాజరయ్యే ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా కరోనా వ్యాప్తి త్వరగా జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ఐపీఎల్‌పై దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు క్రికెట్ బోర్డులు ఆసియా దేశాల్లో పర్యటించే తమ క్రికెటర్లను అప్రమత్తం చేశాయి. అయితే ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఆటగాళ్లు, ప్రేక్షకుల రక్షణ కోసం బీసీసీఐ ఎలాంటి చర్యలు చేపట్టనుందో ఇంతవరకు వెల్లడించకపోవడం గమనార్హం.

కాగా, ఈ మెగా టోర్నీ నిర్ణీత షెడ్యూల్ (మార్చి 29) ప్రకారమే జరుగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించడం విశేషం. కరోనా వైరస్ ప్రభావం ఈ టోర్నీపై ఉండబోదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎలా ఉందో గమనిస్తున్నామని అన్నారు. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం బ్రిజేష్ వ్యాఖ్యలకు మద్దతు పలికాడు. ఐపీఎల్‌పైనే కాదు సౌతాఫ్రికా సిరీస్ పైన కూడా కరోనా ప్రభావం ఉండదని స్పష్టం చేశాడు.

అయితే బీసీసీఐ, ఐపీఎల్ కౌన్సిల్ ప్రకటనలపై మిశ్రమ స్పందన వస్తోంది. డబ్బుల కోసం ప్రేక్షకుల ప్రాణాలను పణంగా పెడతారా అని పలువురు విమర్శిస్తున్నారు. అసలు కరోనాను కట్టడి చేసేందుకు స్టేడియాల్లో ఎలాంటి చర్యలు చేపట్టారో ముందుగా తెలియజేయాలని పలువురు కోరుతున్నారు. మరి ఈ విషయంపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags : IPL, BCCI, Karona, Governing council, Sourav Ganguly


Next Story

Most Viewed