అద్భుతమా..? నిర్లక్ష్యమా..? పోస్టుమార్టం చేస్తుండగా బతికిన వ్యక్తి

by  |
dead body
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక వ్యక్తి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అతడి బాడీని పోస్టుమార్టానికి పంపుతారు వైద్యులు. మరి పోస్టుమార్టం చేసేప్పుడు మనిషి కదలడం ఎప్పుడైనా చూశారా..? సినిమాల్లో అయితే ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ నిజ జీవితంలో చాలా అరుదు. అలాంటి ఘటనే కర్నాటకలో జరిగింది. చనిపోయాడనుకున్న ఒక వ్యక్తిని పోస్టుమార్టం గదిలోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడి సిబ్బంది అతడి ఒంటిపై కత్తి గాటు పెట్టబోతుండగా సడెన్‌గా చేయి కదిలింది.

కర్నాటకలోని బెల్గావిలో చోటు చేసుకుంది ఈ ఘటన. బెల్గావికి చెందిన శంకర్ గోంబి (27)కి ఫిబ్రవరి 27న యాక్సిడెంట్ అయింది. అతడిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్యులు. మూడో రోజు గడిచినా అతడిలో చలనం లేదు. దీంతో అతడు చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు తెలియజేశారు.

శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లిన అతడి కుటుంబసభ్యులు పోస్టుమార్టం కోసం దానిని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష చేయడానికి వెళ్లిన సదరు సిబ్బంది తన పని చేయబోతుండగా సడెన్‌గా ఒక చేయి అతడిని పట్టుకుంది. ఉలిక్కిపడిన అతడు.. ఎవరిదా చేయి అని చూసుకునే సరికి శంకర్.. చేయిని అటూ ఇటూ కదిలిస్తున్నాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సదరు సిబ్బంది పరిగెత్తుకుని వచ్చి పై అధికారులకు విషయాన్ని చేరవేశాడు. వాళ్లు వెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్ కు మార్చి పల్స్ రేట్, హాట్ బీట్ చెక్ చేశారు. శంకర్ బతికే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతడికి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగారని శంకర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శంకర్ మిత్రులు పలువురు.. ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.

Next Story

Most Viewed