ఎల్లో వాటర్‌మిలన్స్‌తో ఎంత సంపాదించాడో తెలుసా?

by  |
ఎల్లో వాటర్‌మిలన్స్‌తో ఎంత సంపాదించాడో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్‌‌లో పుచ్చకాయ‌లు (వాట‌ర్‌మిలన్‌) విరివిగా క‌నిపిస్తున్నాయి. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నాన్ని ఇచ్చే పుచ్చకాయలో ఫైబర్, లైకోపిన్‌, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్‌, విటమిన్‌ ఏ, బీ6, సీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1200 రకాల పుచ్చకాయలను పండిస్తుండగా.. సులభంగా పెట్టెల్లో ప్యాక్ చేయొచ్చన్న కారణంతో జపాన్‌లో గాజు పెట్టెల సాయంతో చతురస్రాకార పుచ్చకాయలను పండిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుచ్చ సాగులో రక‌రకాల ప్రయోగాలు చేస్తున్న అమెరికన్స్.. విత్తుల్లేని పుచ్చకాయలు పండించడంతో పాటు గులాబీ రంగు కాయలను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే భారత్‌లో ఇప్పుడిప్పుడే ఇలాంటి ప్రయోగాలు చేస్తుండగా, కర్ణాటకలోని ఓ యువ రైతు తన పొలంలో పసుపురంగు పుచ్చకాయలను పండించి, లాభాలు ఆర్జించడంతో పాటు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

కర్ణాటక, కలబురగి జిల్లాలోని కొరల్లి గ్రామానికి చెందిన బసవరాజ్ పాటిల్.. గ్రాడ్యుయేషన్ అనంతరం, రైతుగా మారి పుచ్చకాయలు పండిస్తున్నాడు. అందరికీ భిన్నంగా సైంటిఫిక్ పద్ధతిలో ఎల్లో వాటర్ మిలన్స్ పండిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు. ఇవి పైకి సాధారణ పుచ్చకాయల మాదిరి ఆకుపచ్చరంగులోనే ఉన్నా, లోపల గుజ్జు మాత్రం పసుపు రంగులో ఉంటుంది. అంతేకాదు రుచిలోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తొలిగా ఆఫ్రికన్లు ఈ తరహా పసుపువర్ణపు పుచ్చకాయలు పండించగా, ఇవి పురాతన రకాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. వీటిలో లభించే ఏ, సీ విటమిన్స్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూన్ పవర్ పెంచడంతో దోహదపడతాయి. ‘నేను రూ .2 లక్షలు పెట్టుబడి పెట్టగా, రూ .3 లక్షలకు పైగా లాభం పొందాను. వీటి అమ్మకం కోసం లోకల్ సూపర్ మార్కెట్స్‌తో పాటు బిగ్ బజార్‌‌తో‌ ఒప్పందం చేసుకున్నాను. రైతులు కాస్త సాహసం చేసి వైవిధ్యమైన పంటలను వేయండంతో పాటు మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి లాభాలను ఆశించవచ్చు’ అని బసవరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇంతకు ముందు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఎల్లో వాటర్ మిలన్స్‌ను సాగు చేశారు. గోవాలో కూడా ఒక యువ రైతు రసాయన ఎరువులు ఉపయోగించకుండా ఈ రకమైన పుచ్చకాయలను పండించాడు. అయితే ఇప్పటికి కూడా చాలామంది వినియోగదారులకు ఎల్లో వాటర్ మిలన్స్ గురించి అంతగా తెలీదు. సోషల్‌మీడియాలో బసవరాజు పండిస్తున్న పసుపురంగు పుచ్చకాయల గురించి తెలుసుకున్న నెటిజన్లు ‘ఇవి కొత్తరకమైన పుచ్చలా? రుచి ఎలా ఉంటుంది?’ ‘న్యూ ఇన్నోవేషన్.. కంగ్రాట్స్ టూ బసవరాజ్ పాటిల్’, ‘తొలిసారిగా ఎల్లో వాటర్ మిలన్స్ గురించి వింటున్నాను. త్వరగా వాటిని టేస్ట్ చేయాలనుకుంటున్నాను’ ‘బెంగళూరులో ఈ మధ్య వీటిని తిన్నాను. చాలా తియ్యగా ఉన్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed