'యెడియూరప్ప దీర్ఘకాలం సీఎంగా ఉండరు'

by  |
యెడియూరప్ప దీర్ఘకాలం సీఎంగా ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక బీజేపీలో ముసలం మొదలైనట్టు తెలుస్తున్నది. సీఎం యెడియూరప్పపై సొంత పార్టీ నేతలే నోరుపారేసుకుంటున్నారు. తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ సీఎం యెడియూరప్ప దీర్ఘకాలం సీఎంగా కొనసాగబోరని, హైకమాండ్, సీనియర్ బీజేపీ నేతలూ ఆయన వైఖరితో విసిగెత్తిపోయి ఉన్నారని ఆరోపించారు. తదుపరి సీఎంగా ఉత్తర కర్ణాటక నుంచే వస్తారని అన్నారు. ఈ విషయం ప్రధాని మోడీకి కూడా తెలుసని చెప్పారు.

యెడియూరప్ప కర్ణాటక మొత్తానికి సీఎం కాదని, కేవలం ఆయన సొంత జిల్లా శివమొగ్గకే ముఖ్యమంత్రి అని వివరించారు. ఉత్తర కర్ణాటకను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కానీ, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఉత్తర కర్ణాటకనే కారణమని అన్నారు. ఉత్తర కర్ణాటక జిల్లాలే 100 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించాయని, కానీ, సీఎంకు చెందిన దక్షిణ కర్ణాటక జిల్లాలు కేవలం 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను మాత్రమే అసెంబ్లీకి పంపించాయని వివరించారు.

నెక్స్ట్ సీఎం ఉత్తర కర్ణాటక నుంచే ఉంటారని ప్రధాని మోడీ తమకు హామీనిచ్చారని అన్నారు. కాగా, బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ సీటీ రవి ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూలనివ్వమని, ఒకవేళ దానికదే కూలితే తాము ఎన్నికలకు సిద్ధమని కాంగ్రెస్ నేత సిద్ధారామయ్య అన్నారు. ఇటీవలే యెడియూరప్ప పీఎం మోడీ, అధ్యక్షుడు నడ్డా, ఇతర కేంద్ర మంత్రులను వరుసగా కలవడంతో రాష్ట్రంలో బీజేపీ సారథ్యం మారనుందా? అనే ఊహాగానాలు వెలువడటం గమనార్హం.



Next Story