ఆన్‌లైన్ పరిచయం.. కరీంనగర్ యువతి కొంపముంచింది

by  |
ఆన్‌లైన్ పరిచయం.. కరీంనగర్ యువతి కొంపముంచింది
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఆన్‌లైన్ పరిచయం కరీంనగర్ యువతి కొంపముంచింది. కొంచెం ఆలస్యమైతే ఆమె జీవితమే పెద్ద ప్రమాదంలో పడేది. అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడింది. ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మి వచ్చిన యువతిని వ్యభిచార ముఠాకు అప్పగించింది ఏపీకి చెందిన ఓ మహిళ. వారు బలవంతంగా మద్యం తాగించి ఆమెను గృహ నిర్బంధం చేశారు. ఈ దారుణమైన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి రూరల్‌కు చెందిన ఓ మహిళకు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ యువతితో కొన్నేళ్ల కిందట ఆన్‌లైన్ మాద్యమాల ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన మహిళ.. అప్పటివరకు తన ఇంట్లో ఉండి పనిచేసుకోమని ఆ యువతిని తిరుపతికి రప్పించింది. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న యువతి తిరుపతి వచ్చేందుకు కారు చార్జీలు రూ.11 వేలు అద్దె చెల్లించింది.

కారులో వస్తున్న యువతి కోసం కరకంబాడి మార్గంలో ఇద్దరు బాలికలు, ఓ వివాహితను ఆమె పంపించింది. అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. దీంతో ఉద్యోగం కోసం వచ్చిన యువతి షాక్‌ కు గురైంది. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో వ్యభిచార ముఠా సభ్యులు దాడి చేసి అక్కడే గృహ నిర్బంధం చేశారు. అనంతరం బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసేందుకు యత్నించగా, బాధితురాలు తప్పించుకుని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి చేరింది.

అయినా, వదలని వ్యభిచార ముఠా సభ్యులు అక్కడకు చేరుకుని ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాధితురాలు ప్రతిఘటించడంతో పాటు రుయా సిబ్బంది కూడా ముఠా సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే పోలీసులకి సమాచారం అందడంతో వారు రుయాకు చేరుకుని బాధితురాలిని విచారించారు. దాంతో ఈ విషయం వెలుగులోకివచ్చింది.వెంటనే బాధితురాలిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story