గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

by  |
గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు శనివారం గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జగన్మాత గాయత్రి దేవికి వేదమూర్తులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు.

గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. ఇకపోతే అమ్మవారికి నేడు పులిహోర, అల్లంగారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుందని.. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇకపోతే అమ్మవారిని దర్శించుకోవడాని భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్ పొందిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. భక్తులకు శానిటైజ్ చేయడంతోపాటు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.


Next Story

Most Viewed