మాంద్యంవేళ.. కాళేశ్‌‘వరం’

by  |
మాంద్యంవేళ.. కాళేశ్‌‘వరం’
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోని పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేటు పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలకు వరంగా మారింది. ఈ భారీ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రయల్‌రన్‌కే రాష్ట్ర విద్యుత్ వినియోగం రాకెట్ స్పీడుతో దూసుకుపోతుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. నిజానికి దేశంలో ఆర్థికమాంద్యం వల్ల ఈ ఏడాది డిమాండ్ పెద్దగా లేక గుజరాత్, మహారాష్ట్ర వంటి భారీ పారిశ్రామికోత్పత్తి కలిగిన రాష్ట్రాల్లోనే విద్యుత్ వినియోగం అంతగా పెరగలేదు. కానీ, తెలంగాణలో మాత్రం ఈ నెల 17వ తేదీ నుంచి విద్యుత్ వినియోగం రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తోంది. 12,136 మెగావాట్లతో మొదలైన 17వ తేదీ నమోదైన పీక్ డిమాండ్ 26వ తేదీకొచ్చేసరికి 13 వేల 40 మెగావాట్లకు చేరడంతో దేశంలోని మిగులు విద్యుత్ అమ్ముకునే సంస్థలకు అమ్మకాలకు మంచి అవకాశం దొరికినట్లవుతోంది. ఒక్క ఉత్తర తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) అయిన టీఎస్ఎన్పీడీసీఎల్‌లోనే డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 2 వేల 500 మెగావాట్లు ఎక్కువగా పీక్ డిమాండ్‌లో నమోదవుతోంది. ఈ డిస్కం పరిధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుండడం, ఆ భారీ ప్రాజెక్టు లిఫ్టులను పూర్తిస్థాయిలో ఫిబ్రవరి 17 నుంచే రన్ చేస్తుండడంతో ఈ డిస్కం పరిధిలో విద్యుత్ వినియోగం కొత్త రికార్డులు బ్రేక్ చేస్తుండడం విశేషం.

పీపీఏలు లేని ‘జెన్ కో’లకు మంచి పవర్ సేల్స్

మంగళవారం తెలంగాణలో వినియోగమైన 250 మిలియన్ యూనిట్లలో(ఎం.యూ) జెన్ కో థర్మల్, హైడల్, రెన్యువబుల్, సింగరేణి పవర్ ప్రాజెక్టు అన్ని కలిపి సరఫరా చేసిన మొత్తం విద్యుత్ కేవలం 118 మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటే ఇంకా 130 మిలియన్ యూనిట్లు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి, ఎక్స్చేంజిలో ట్రేడయ్యే స్పాట్ పవర్ కొంటున్నారు. ఎక్స్ఛేంజీలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎవరి దగ్గర మిగులు విద్యుత్ ఉంటే వారు పవర్ అమ్మకానికి పెడుతుంటారు. దేశంలో ఆర్థిక మాంద్యం వల్ల పారిశ్రామిక ఉత్పత్తిలేని సమయంలో ఆ రంగం నుంచి డిమాండ్ లేక జనరేటింగ్ కంపెనీల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)లు 60 శాతం కూడా ప్రస్తుతం మించని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉన్న కెపాసిటీకి సరిపడా దీర్ఘకాలిక పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్(పీపీఏ)లు లేని పవర్ జనరేటింగ్ కంపెనీలు పరిశ్రమలకు స్పాట్ ఓపెన్ యాక్సెస్ విధానంలో మర్చంట్ పవర్ అమ్మడం లేదా ఎక్స్ఛేంజిలో డే ఎ హేడ్, టర్మ్ ఎ హేడ్ మార్కెట్‌లలో అమ్ముకుంటాయి. ఇలాంటి పీపీఏలు లేని పవర్ జనరేటింగ్ కంపెనీలకు ప్రస్తుత మాంద్యం టైంలో తెలంగాణలో ట్రయల్ రన్ జరుపుకుంటున్న కాళేశ్వరం వరప్రదాయినిలా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం దేశంలో ఎక్స్ఛేంజీల్లో అత్యధిక కరెంటు కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ పేరే ప్రముఖంగా వినిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఇలా పూర్తి కెపాసిటీకి పీపీఏలు కుదరని పవర్ జనరేటింగ్ కంపెనీలు ఎక్స్ఛేంజీల్లో కరెంటు అమ్ముకొని కొంత వరకు వాటి నష్టాలు తగ్గించుకొంటుంటాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏకంగా దేశంలోని పవర్ జనరేటింగ్ కంపెనీలకు మాంద్యంవేళ విద్యుత్ అమ్మకాలు జరుపుకొనే అవకాశం దొరికిందని తెలుస్తోంది.

25 రోజుల్లో 21 మిలియన్ యూనిట్ల తేడా

సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీఎస్) నుంచి, పర్చేజింగ్ చేసి వినియోగించుకునే కరెంటు తెలంగాణలో ఈ సంవత్సరం జనవరి 31వ తేదీన 115 మిలియన్ యూనిట్లు మాత్రమే నమోదైంది. ఇదే కేటగిరిలో సేకరించి వాడుకునే కరెంటు ఫిబ్రవరి 25వ తేదీ అంటే మంగళవారం 136 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, రబీ సీజన్ వల్ల 25 రోజుల్లో రాష్ట్రంలో డిమాండ్‌ను అందుకోవడానికి విద్యుత్ కొనుగోళ్లు 21 మిలియన్ యూనిట్లు పెరిగాయి. రాష్ట్రంలో పవర్ జనరేటింగ్ సామర్థ్యంలో పెద్ద వృద్ధి లేకపోయినప్పటికీ కేవలం కొనుగోళ్ల మీద ఆధారపడి భారీ లిఫ్టులను నడపడం అన్ని రంగాలకు 24 గంటలు ఉచిత విద్యుత్‌నందించడం డిస్కంల ఆర్థిక పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణ డిస్కంలు ఓ పక్క అప్పుల మీద అప్పులు తెచ్చి ఎక్స్ఛేంజీల్లో ఇబ్బడిముబ్బడిగా విద్యుత్ కొని దేశంలోని పవర్ జనరేటింగ్ కంపెనీలకు నష్టాలు తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story

Most Viewed