నందిగ్రామ్ ఎలక్షన్‌ పిటిషన్‌ విచారణకు ఓకే

by  |
నందిగ్రామ్ ఎలక్షన్‌ పిటిషన్‌ విచారణకు ఓకే
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి తనపై సువేందు అధికారి సాధించిన విజయాన్ని సవాల్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సువేందు అధికారి, రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. ఆ ఎన్నికలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, వీడియోలు, ఎన్నికల పేపర్లు, డివైజులను భద్రపరచాలని ఈసిని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 12న చేపడతామని వాయిదా వేసింది. కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ దీదీ దాఖలు చేసిన పిటిషన్ విచారించడానికి మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

జస్టిస్ శంపా సర్కార్ సారథ్యంలోని బెంచ్ ఈ పిటిషన్ విచారిస్తున్నది. దీదీ పిటిషన్ విచారిస్తున్న ధర్మాసనం నుంచి జస్టిస్ కౌశిక్ చందా తప్పుకున్నాక చీఫ్ జస్టిస్ బిందాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పిటిషన్‌ విచారిస్తున్న జస్టిస్ చందాకు బీజేపీవర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయని, విచారణ పక్షపాతంగా జరిగే ముప్పు ఉన్నదని దీదీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కలకత్తా హైకోర్టు నందిగ్రామ్ ఎన్నికల పిటిషన్‌ను విచారించడానికి స్వీకరించిన గంటల వ్యవధిలోనే సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు నుంచి ఇతర ఏ హైకోర్టుకు అయినా బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై దాడి జరుగుతున్నదని బెంచ్ నుంచి తప్పుకోవడానికి ముందు జస్టిస్ కౌశిక్ చందా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాష్ట్రం నుంచి ఈ పిటిషన్ విచారణను బదిలీ చేయాలని అధికారి సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

Next Story

Most Viewed