మోత్కుపల్లి ఎంట్రీతో కడియం శ్రీహరి పదవికి ఎసరు..?

by  |
మోత్కుపల్లి ఎంట్రీతో కడియం శ్రీహరి పదవికి ఎసరు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరడంతో మాజీ మంత్రి కడియం శ్రీహరి ఖంగు తిన్నారు. గతంలో ఒకేపార్టీలో ఉండగా ఇద్దరి మధ్య సయోధ్య ఉండకపోయేది. ఇద్దరు సీనియర్లు కావడం… అభిప్రాయ భేదాలు ఉండటం… గత కొంతకాలంగా వేర్వేరు పార్టీలో ఉండగా ఇప్పుడు ఒకే పార్టీకి చేరారు. దీంతో మోత్కుపల్లి చేరిన రెండోరోజే తెలంగాణ భవన్‌కు కడియం రావడం… కేటీఆర్‌తో చర్చించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీడీపీలో కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు రాజకీయంగా ఎదిగారు. ఇద్దరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా కడియం, ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మోత్కుపల్లి ఉన్నారు. నాటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కడియం టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రిగా పనిచేశారు. అయితే మోత్కుపల్లి మాత్రం టీడీపీ నుంచి బహిష్కరణ అయిన తర్వాత బీజేపీలో చేరారు. తిరిగి ఈ నెల 18న టీఆర్ఎస్‌లో కేసీఆర్ సమక్షంలో చేరారు. ఇప్పటికే కడియంకు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రచారం జరుగుతుండటం, ఈ తరుణంలోనే మోత్కుపల్లి గులాబీ గుటికీ చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే దళిత బంధును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మోత్కుపల్లి గొప్ప పథకం… అభినవ అంబేద్కర్ కేసీఆర్ అని ప్రశంసలు కురిపించగా, కడియం మాత్రం పులిపై సవారి దళితబంధు అని పేర్కొన్నారు. దళితబంధు సమితి బాధ్యతలను మోత్కుపల్లిని అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కడియం, మోత్కుపల్లిలు ఇద్దరు దళితులు కావడంతో ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులు ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో మోత్కుపల్లి చేరిన రెండోరోజే తెలంగాణ భవన్‌కు వచ్చి కడియం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో మంతనాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకోవడం, కొద్దికాలంగా భవన్‌కు రాకపోవడం.. ఇప్పుడు సడన్‌గా రావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోత్కుపల్లి ఎంట్రీతో కడియంకు నామినేటెడ్ పదవి రాదోమోనని ఆందోళన గురవుతున్నారని, అందులో భాగంగానే కేటీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story