20 మంది ఎమ్మెల్యేల రాజీనామా?

by  |
20 మంది ఎమ్మెల్యేల రాజీనామా?
X

కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన్ని బీజేపీ తరఫున పెద్దలకు సభకు పంపుతారని సమాచారం. మరోవైపు సింధియా మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు తమ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఫ్యాక్స్ ద్వారా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా లేఖలు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ పరిణామాలతో 15 నెలల కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఇలాగే గత ఏడాది చివరలో కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే అది ఆ పార్టీకి శరాఘాతం కానున్నది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు భోపాల్‌‌లో బీజేపీ శాసనసభా పక్షం భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశం ద్వారా బల నిరూపణ ప్రయత్నంలో మాజీ సీఎం శివరాజ్‌సింగ్ ఉన్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లో సంక్షోభానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాను బుజ్జగించడానికి కాంగ్రెస్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోమవారం సాయంత్రం నుంచీ ఆయన్ని కలవడానికి ఆ పార్టీ ప్రతినిధులు ప్రయత్నించినా వీలుకాలేదు. ‘సింధియాతో మాట్లాడటానికి ప్రయత్నించాం. కానీ, ఆయన స్వైన్‌ ఫ్లూతో బాధపడుతున్నట్లు చెప్పారు. మాట్లాడే పరిస్థితుల్లో లేనన్నారు’ అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ నేతలు సచిన్ పైలెట్, కరణ్‌సింగ్ రంగంలోకి దిగారు. ‘అతి త్వరలోనే మధ్యప్రదేశ్‌లో పరిస్థితులు సర్దుకుంటాయని, విభేదాలను చక్కదిద్దుకోవడానికి తమ నాయకులు సంసిద్ధంగా ఉన్నారు’ అని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ట్వీట్ చేశారు.
2018, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో జ్యోతిరాదిత్య సింధియా కీలక భూమిక పోషించారు. అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. కానీ, సింధియా మధ్యప్రదేశ్ సీఎం కాలేకపోయారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ, జ్యోతిరాదిత్య బహిరంగంగానే బీజేపీ నిర్ణయాన్ని సమర్థించారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహార శైలిపై ఆయన తరుచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గాంధీ కుటుంబానికి సింధియా అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఆయన్ని ఎలాగైనా బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు సింధియాను నామినేట్ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికార సమాచారం వెలువడలేదు.

Tags: Jyotiraditya Scindia Quits,Congress,Meeting,PM Modi,amit shah

Next Story

Most Viewed