జూరాల ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తివేత

by  |
జూరాల ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తివేత
X

దిశ, మహబూబ్ నగర్: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో బుధవారం 8 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహం పెరగడంతో జలాశయానికి 40,076 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఎగువన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 9.500 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో జలాశయం 8 గేట్లు తెరిచి 28,641 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమాకు 650, కోయిల్ సాగర్​కు 630, కుడి కాలువకు 252, ఎడమ కాలువకు 700, పార్లల్ కెనాల్​కు 900 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద నీరు పెరుగుతుండటంతో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని 6 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోంది. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

శ్రీశైలంలో పెరుగుతున్న వరద..

శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, హంద్రీనీవా నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 56,570 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయ ప్రస్తుత నీటి మట్టం 815.50 అడుగులు ఉండగా 37.6570 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed