దిక్కుతోచని జూపల్లి!

by  |
దిక్కుతోచని జూపల్లి!
X

దిశ, మహబూబ్‌నగర్

ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే నానుడి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుకు సరిగ్గా సరిపోతుంది. అటు టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇటు స్థానిక నాయకుల నుంచి మద్దతు లేకపోవడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. సొంత పార్టీలో ప్రాముఖ్యత కరవు కావడంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర పార్టీలు బలంగా లేకపోవడంతో అటు టీఆర్‌ఎస్‌లో ఉండలేక మరో పార్టీలోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన అనుచరగణం అంటోంది. ఇటీవల ఆయన మరో పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చినా స్వయంగా జూపల్లే ఖండించాల్సి వచ్చింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. పైగా ఎమ్మెల్యేగా గెలిచిన బీరం టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యేకు సహకరించడంతోపాటు నియోజకవర్గంలోని ముఖ్యనేతలు సైతం ఒక్కొక్కరిగా బీరం వైపు వెళ్లారు. దీంతో జూపల్లి పరిస్థితి రెండింటికి చెడిన రెవడిలా తయారైంది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చెప్పిన వారికే టిక్కెట్లు దక్కాయి. దీంతో జూపల్లి తిరుగుబాటు అభ్యర్థులను బరిలో దింపారు. కొల్లాపూర్, అయిజ, వనపర్తి మున్సిపాలిటీల్లో తన అభ్యర్థులను రంగంలోకి దించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు దీటుగా రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా రెండు మున్సిపాలిటీల్లో కూడా రెబల్స్ కారణంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో తనకు ఉన్న పట్టును నిరూపించుకున్న జూపల్లి తన మద్దతుదారులు టీఆర్‌ఎస్‌ పార్టీకే మద్దతు ఇస్తారని ప్రకటించి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఇక్కడ ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. జూపల్లి మద్దతు తమకు అవసరం లేదని, సొంత పార్టీనకి వ్యతిరేకంగా గెలిచిన వారి సహకారం తాము తీసుకోదల్చుకోలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. దీంతో నిరాశతో వెనుదిరిగిన జూపల్లి అప్పటి నుంచి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నామినేటెడ్ పదవి కూడా ఆయనకు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed