సివిల్స్ పరీక్షలపై జూన్ 5న క్లారిటీ?

by  |
సివిల్స్ పరీక్షలపై జూన్ 5న క్లారిటీ?
X

దిశ, న్యూస్ బ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడంపై జూన్ 5న యూపీఎస్సీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 31వ తేదీన సివిల్ ప్రిలిమినరీ పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ నాల్గో విడత లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని యూపీఎస్సీ పేర్కొంది. అయితే తదుపరి ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై బోర్డు వచ్చే నెల 5వ తేదీన సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అదే రోజున పరీక్షల షెడ్యూలును వెల్లడి చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదికి 796 సివిల్ పోస్టులను భర్తీ చేయడానికి పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రతీ ఏటా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్‌వ్య్వూ పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. తొలుత అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 4వ తేదీనే ప్రిలిమినరీ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మూడో దశ లాక్‌డౌన్ కారణంగా ఈ నెల 31వ తేదీకి వాయిదా పడింది. కానీ నాల్గవ విడత లాక్‌డౌన్ కూడా రావడంతో వచ్చే నెలకు వాయిదా పడింది. ఐఎఫ్ఎస్ స్క్రీనింగ్ టెస్టు జరగాల్సి ఉండగా దాన్ని కూడా వాయిదా వేసినట్లు తెలిపింది. ఈ పరీక్షల్లో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నందున ప్రిపేర్ కావడానికి కనీసం నెల రోజుల సమయమైనా ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీన సమావేశమైన తర్వాత నిర్దిష్ట షెడ్యూలు ఖరావుతుందని యుపీఎస్సీ పేర్కొంది. గతేడాదికి సంబంధించిన పర్సనాలిటీ టెస్టులను, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్, కంబైన్డ్ మెడికల్ సర్వీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఎన్డీఏ, నావల్ అకాడమీ తదితర అన్ని పరీక్షలూ వాయిదా పడ్డాయి.

Next Story

Most Viewed