ఇది పబ్లిసిటీ స్టంటా?.. కోర్టు వ్యాఖ్యలపై సీనియర్ నటి ఫైర్

by  |
Juhi Chawla
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా తోటి జీవుల గురించి ఆందోళన చేయడం తప్పా అని ప్రశ్నిస్తోంది. 5జీ టెక్నాలజీని వ్యతిరేకిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన తనను న్యాయస్థానం తప్పుపట్టింది. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుందని.. రూ.20లక్షల జరిమానా విధించింది. దీంతో సోషల్ మీడియాలో ఓ వర్గం తనను నిందిస్తే.. మరో వర్గం తనను ప్రశంసించిందని తెలిపింది జూహీ చావ్లా. అంతేకాదు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు సంఘం సభ్యులు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జమ చేసి.. ఈ డబ్బుతో కోర్టు జరిమానా చెల్లించాలని సూచించారని, ఈ ఘటన కన్నీరు తెప్పించిందని తెలిపింది. ఈఎంఎఫ్ రేడియేషన్ వల్ల కలిగే అనారోగ్య ప్రభావాలపై 11ఏళ్లు అధ్యయనం చేశానన్న సీనియర్ నటి.. మొబైల్ టవర్ రేడియేషన్ ప్రభావాలపై సమాధానం కోరుతూ 2019-2020లో ఆర్‌టిఐకి దరఖాస్తును సమర్పించానని చెప్పింది. దీంతో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఇచ్చిన రిపోర్ట్ చూశాక.. అలాంటి నివేదికలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేవని, 5Gపై ప్రత్యేకంగా అధ్యయనాలు ఏమీ చేయలేదనే విషయం అర్థమైందని తెలిపింది.

2010లో తన ఇంటికి దగ్గరలో మొబైల్ టవర్లను చూశానన్న ఆమె.. ఇదే తనను రేడియేషన్ ప్రభావాలను లోతుగా పరిశోధించేందుకు దారితీసిందని తెలిపింది. ఇంట్లో రేడియేషన్ ఫ్రీక్వెన్సీని తనిఖీ చేయడానికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీ రేడియేషన్ అత్యధిక స్థాయిలో ఉందని పేర్కొనగా.. ఆర్టీఐకి లేఖ రాయడంతో తన ఇంటి చుట్టూ ఉన్న 14 మొబైల్ టవర్లలో చట్టవిరుద్ధంగా నిర్మించబడిన 13 టవర్లను తొలగించారని వివరించింది. దీంతో ఇదే సమస్య ఎదుర్కొంటున్న ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించానన్న జూహీ చావ్లా.. ఈ అంశాన్ని లేవనెత్తుతూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెళ్లానని, కోర్టులను కూడా ఆశ్రయించానని వీడియో ద్వారా తెలిపింది. మానవాళికి పొంచిఉన్న ముప్పు గురించి ఆలోచించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించింది.



Next Story

Most Viewed