‘ఎన్నికలు వాయిదా వేయండి’

by  |
‘ఎన్నికలు వాయిదా వేయండి’
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : రాష్ట్రంలో కొవిడ్ ఉధృతంగా ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న మినీ మున్సిపల్, రెండు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేసేలా రాష్ట్రప్రభుత్వం, ఎన్నిక‌ల సంఘంను కోరాల‌ని మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్యవ‌తిరాథోడ్‌ను వ‌రంగ‌ల్ జ‌ర్నలిస్టులు విన్నవించారు. హ‌న్మకొండ‌లోని మంత్రి ఎర్రబెల్లి స్వగృహంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో పార్టీ అభ్యర్థుల‌కు బీఫారంల పంపిణీ అనంత‌రం మంత్రుల దృష్టికి క‌రోనా విష‌యాన్ని జర్నలిస్టులు తీసుకెళ్లారు.

ఇప్పటికే రాష్ట్రంలో న‌లుగురు క‌రోనాతో మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఆరుగురు తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నార‌ని అన్నారు. అత్యంత భ‌యాన‌క‌మైన ప‌రిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వ‌స్తోంద‌ని జ‌ర్నలిస్టులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో ప‌డే అవ‌కాశం ఉంద‌ని, సాగ‌ర్‌లో ఉప ఎన్నిక నిర్వహించ‌డం వ‌ల‌న అక్కడ 4శాతంగా ఉన్న క‌రోనా ఉధృతి, 40శాతానికి మించిపోయిన విష‌యాన్ని ఈసంద‌ర్భంగా మంత్రుల‌కు గుర్తు చేశారు. అయితే ఎన్నిక‌లు వాయిదా వేసే విష‌యం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేద‌ని, ఎన్నిక‌ల సంఘం ఎలా చెబితే అలా చేయ‌డం వ‌ర‌కేన‌ని మంత్రులు పేర్కొన్నారు. అయితే మంత్రులు స్పందించిన తీరుపై ప‌లువురు జ‌ర్నలిస్టులు అస‌హ‌నం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed