ప్రధాని దత్తత గ్రామంపై స్టోరీ.. జర్నలిస్టుపై కేసు

by  |
ప్రధాని దత్తత గ్రామంపై స్టోరీ.. జర్నలిస్టుపై కేసు
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని దోమారి గ్రామం.. లాక్‌డౌన్ కాలంలో ఎదుర్కొన్న సమస్యలను చిత్రిస్తూ స్టోరీ రాసిన ఓ వెబ్‌సైట్ జర్నలిస్టుపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి, మంత్రులకు ఇబ్బందికరంగా రిపోర్ట్ చేసిన విలేకరులపై యూపీ ఇప్పటికే పలుసార్లు కేసులు నమోదు చేసింది. తాజాగా, స్క్రోల్.ఇన్ అనే ఇంగ్లీష్ న్యూస్ వెబ్‌సైట్‌లో పనిచేస్తున్న సుప్రియ శర్మ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో అతను దత్తత తీసుకున్న దోమారి గ్రామాన్ని పర్యటించి ఇంటర్వ్యూలు తీసుకుని ఓ రిపోర్ట్ రాశారు. లాక్‌డౌన్ కాలంలో ప్రధాని దత్తత గ్రామంలో ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు అనే శీర్షికతో స్క్రోల్.ఇన్ వెబ్‌సైట్ ఆ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ కథనంలో దోమారి గ్రామంలో ఓ మహిళను చేసిన ఇంటర్వ్యూ అర్ధసత్యంగా రిపోర్ట్ చేశారని యూపీ పోలీసులు కేసు ఫైల్ చేశారు. పరువు నష్టం, నిర్లక్ష్య ప్రవర్తన, వైరస్ వ్యాపించేలా వ్యవహరించారన్న అభియోగాలు మోపారు. వీటితోపాటు ఇంటర్వ్యూ ఇచ్చిన మహిళ ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కిందా కేసు నమోదైంది. కాగా, వెబ్‌సైట్ సంస్థ మాత్రం ప్రచురించిన కథనానికి కట్టుబడి ఉన్నామని, అందులో నిజాలే ఉన్నాయని ప్రకటించింది. జర్నలిస్టు సంఘాలు, మాజీ న్యాయమూర్తులు సుప్రియ శర్మకు అండగా నిలిచారు. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛలు ప్రమాదంలో పడటం దురదృష్టకరమంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకం కింద యూపీ మీర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో మధ్యాహ్న భోజనంలో చపాతీలో ఉప్పు వేసి ఇచ్చిన ఘటనను వీడియో తీసిన జర్నలిస్టుపై గతేడాది ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిరసనలు వెలువడ్డ తర్వాత ఉపసంహరించుకున్నారు.

Next Story