యూత్‌ను భయపెడుతున్న ‘జోకర్ సాఫ్ట్‌వేర్’.. క్లిక్ చేస్తే అంతే సంగతులు..!

by  |
యూత్‌ను భయపెడుతున్న ‘జోకర్ సాఫ్ట్‌వేర్’.. క్లిక్ చేస్తే అంతే సంగతులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పాండమిక్ సమయంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా వరకు యూత్ ఇంట్లోనే ఉంటూ గ్యాడ్జెట్స్‌తో కాలం వెల్లదీస్తున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్స్, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లతో కావాల్సిన వెబ్‌సైట్లను వీక్షిస్తున్నారు. వీరిని టార్గెట్ చేసుకున్న సైబర్ కేటుగాళ్లు నయా మోసానికి తెరలేపారు.

జోకర్‌ సాఫ్ట్‌వేర్‌ క్రియేట్ చేసి.. నోటిఫికేషన్లు పంపుతున్నారు. ఇలా వచ్చిన నోటిఫికేషన్లను క్లిక్ చేస్తే చాలు.. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుగా.. పూర్తి సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. ఇలా అకౌంట్‌లో ఉన్న డబ్బులను దోచేస్తున్నారు. వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడుతున్నారు. ఈ ఫిర్యాదులతో జోకర్ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే 5 సార్లు గూగుల్ డిలీట్ చేసినా.. మెట్రో నగరాల్లో మాత్రం నేరుగా ఫోన్లు, డెస్క్‌టాప్‌లపై ప్రత్యక్షమవుతూ.. జోకర్ సాఫ్ట్‌వేర్ హడలెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రజలను అప్రమత్తం చేశారు. జోకర్ సాఫ్ట్‌వేర్‌ను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. బుధవారం సీపీ మీడియాతో మాట్లాడుతూ.. జోకర్ సాఫ్ట్‌వేర్ ద్వారా సైబర్ నేరగాళ్ల చేతికి వ్యక్తిగత సమాచారం వెళుతోందన్నారు. ఇందులో భాగంగా బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ నుంచి పర్సనల్ ఫోటోస్‌‌ను క్రిమినల్స్ రాబట్టుకుంటున్నారని చెప్పారు. ఈ సాఫ్ట్‌వేర్ పట్ల ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని అంజనీ కుమార్ సూచించారు.


Next Story