మంత్రి గారు ప్లీజ్.. పోస్టింగ్‌ల కోసం బేరసారాలు

by  |
మంత్రి గారు ప్లీజ్.. పోస్టింగ్‌ల కోసం బేరసారాలు
X

ప్రభుత్వ శాఖలలో పదోన్నతుల జాతరతో అమాత్యుల దగ్గరకు పైరవీలు జోరందుకున్నాయి. స్వరాష్ట్రంలో ఇప్పటిదాకా సరైన స్థానంలో పని చేయలేదంటూ కొంతమంది పదోన్నతులు పొందిన అధికారులు మంత్రుల దగ్గరకు క్యూ కడుతున్నారు. పలు శాఖల్లో కీలక స్థానాల కోసం లక్షలు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా మంత్రుల అనుచరులు రంగంలోకి దిగుతున్నారు. పోస్టింగ్​లు ఇప్పిస్తామంటూ బేరసారాలకు దిగుతున్నారు. మంత్రుల పేషీల్లో ఇప్పుడు బదిలీల అంశమే ప్రధానమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : చాలా రోజుల తర్వాత ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో పోస్టింగ్​ల కోసం పైరవీలు మొదలయ్యాయి. ఒకేసారి పదోన్నతులు రావడం, ఇప్పటి వరకు పని చేసిన కుర్చీలను వదలకతప్పకపోవడంతో కీలక స్థానాల్లో పోస్టింగ్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మంత్రుల దగ్గరకు మకాం మార్చారు. దీంతో పేషీలన్నీ ఉద్యోగులతో సందడిగా మారుతున్నాయి. ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల్లో గతంలో ఉద్యోగ సంఘాలు కీలక ప్రతిపాదనలు చేసేవి. ఆయా జిల్లాల్లో తమ సంఘం నేతలకు ప్రాధాన్యత పోస్టులను ఇప్పించుకునేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యోగ సంఘాల నేతలకు స్థానికంగా ప్రియార్టీ తగ్గినట్లు భావిస్తుండటంతో ఉద్యోగ నేతలు భాగ్యనగరానికి రాజకీయం మార్చారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు తమ వర్గాలను తీసుకుని అక్కడే ఉండి పోస్టింగ్​ల కోసం పట్టుబడుతున్నారు.

అమాత్యులే ఫైనల్​..

మరోవైపు ఏ శాఖలోనైనా సంబంధిత మంత్రులదే తుది నిర్ణయమంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. సదరు మంత్రులు చెప్పితినే రాష్ట్రంలో ఎక్కడైనా పోస్టింగ్​ దక్కుతుందని భావిస్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు దీనిపై మంత్రులతో సైతం వాదిస్తున్నారు. అయినా వారిని ఒప్పించే బాధ్యతలను కూడా అమాత్యులే మీదేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ బదిలీల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. ఇప్పటికే సరైన పనులు లేక నిధులు రాక ఆర్థిక కష్టాల్లో ఉన్న మంత్రుల అనుచరులకు ఈ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కలిసి వస్తోంది. మంత్రులకు దగ్గరగా ఉండే అనుచర వర్గం ఇద్దరు, ముగ్గురు ఉద్యోగుల నుంచి వసూళ్ల పర్వానికి దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఉన్నతాధికారవర్గాలు కూడా మంత్రులదే నిర్ణయమంటూ ఉద్యోగ వర్గాలకు లీకు చేస్తున్నారు. కొన్ని శాఖల్లో మంత్రుల దగ్గరకు వెళ్లాలంటూ సంకేతాలిస్తున్నారు. అక్కడ నుంచి వస్తేనే పోస్టింగ్​ పదిలమంటూ చెప్పుతున్నారు. అంతేకాకుండా ఈ స్థానాల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎంత మేరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో కూడా లీకులిస్తున్నారు. దీంతో ఎలాగైనా మంత్రులతో పైరవీ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదే మంచి సమయమనీ..

ఉద్యోగ వర్గాలు దాదాపు ఎనిమిదేండ్లుగా పదోన్నతులకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది ప్రియార్టీ లేని పోస్టుల్లో సర్వీస్​ వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పదోన్నతులు రావడం, బదిలీలు చేయాల్సి వస్తుండడంతో కచ్చితంగా మంచి పోస్టింగ్​ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీనికోసం స్థాయి మేరకు ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పోలీస్​, ఎక్సైజ్​, రెవెన్యూ, పంచాయతీరాజ్​, కమర్షియల్​ ట్యాక్స్​ వంటి శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయింది. ఒక్కో శాఖలో 100 నుంచి 300 మంది వరకు పదోన్నతులు పొందారు. ప్రధాన శాఖల్లో ఈ పైరవీలు మాత్రం ఎక్కువగా సాగుతున్నాయి. పోలీస్​, ఎక్సైజ్​, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, వ్యవసాయం, మార్కెటింగ్​, పంచాయతీరాజ్​వంటి శాఖల్లో మాత్రం ఆదాయం వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా పలు​ శాఖల్లో పదోన్నతులు కన్ఫర్మ్​ అయి పోస్టింగ్​ అంశంలో ఇద్దరు మంత్రుల దగ్గర అధికారులు రాజీ యత్నాలకు దిగారు. అమాత్యులు బదిలీల కోసం వచ్చే వారికి భరోసా కల్పిస్తున్నారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు కూడా మంచి పోస్టింగ్​ కావాలంటూ అడుగుతున్నారు. ఉద్యోగవర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉంటే మంత్రులైతే తమవర్గానికి భరోసా కల్పిస్తున్నారు. అంతా చూసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయితే బదిలీల కోసం మరింత ప్రయత్నాలు ఎక్కువకానున్నాయని ఉద్యోగ నేతలు చెబుతున్నారు.

Next Story

Most Viewed