4జీ స్పీడ్‌లో రిలయన్స్ జియోదే అగ్రస్థానం

by  |
Reliance-Jio1
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నెట్‌ వేగం అందించే విషయంలో దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి సెకనుకు 20.9 ఎంజీబీఎస్ సగటు డౌన్‌లోడ్ వేగాన్ని జియో నమోదు చేసిందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం వెల్లడించింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. అప్‌లోడ్‌కు సంబంధించి వొడాఫోన్ ఐడియా 7.2 ఎంజీబీఎస్ డేటా వేగంతో అగ్రస్థానంలో ఉంది. సమీక్షించిన నెలలో రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ స్పీడ్ దాదాపు 15 శాతం పెరిగింది. అయితే, జియో స్థాయిలోనే నెలవారీగా నెట్‌వర్క్ స్పీడ్‌లో ఇతర టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్ 85 శాతం పెరిగి 11.9 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 60 శాతం వృద్ధితో 14.4 ఎంబీపీఎస్‌గా అధిక వేగాన్ని నమోదు చేశాయి. సెప్టెంబర్‌లో దిగ్గజ మూడు టెలికాం సంస్థల 4జీ అప్‌లోడ్ వేగం మెరుగుపడిందని ట్రాయ్ అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియా అధికంగా 7.2 ఎంబీపీఎస్ స్పీడ్‌ని నమోదు చేసింది. తర్వాత రిలయన్స్ జియో 6.2 ఎంబీపీఎస్, ఎయిర్‌టెల్ 4.5 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగాన్ని సాధించాయి. ఇక, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే 4జీ సేవలను అందిస్తున్నప్పటికీ ట్రాయ్‌ డేటాలో పొందుపరచడం లేదు.

Next Story