రూ. 5 వేల కంటే తక్కువకే 5జీ స్మార్ట్‌ఫోన్..?

by  |
రూ. 5 వేల కంటే తక్కువకే 5జీ స్మార్ట్‌ఫోన్..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మళ్లీ సంచలనాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమైన 5జీ విభాగంలో ఎవరూ ఊహించని స్థాయిలో కేవలం రూ. 5,000కే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘రిలయన్స్ జియో రూ. 5,000 కంటే తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

విక్రయ డిమాండ్‌ను బట్టి ఆ ఫోన్ ధర రూ. 2,500 నుంచి రూ. 3,000 ధరలో విక్రయాఇంచాలని చూస్తుట్టునట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే, రిలయన్స్ జియో నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నాలుగేళ్ల క్రితం 4జీ టెక్నాలజీతో దేశీయ టెలికాం రంగాన్నే మర్చేసిన జియో, 4జీలో అత్యుత్తమ సేవలనందిస్తూ దూసుకెళ్తోంది. అంతేకాకుండా, ఇప్పటికీ దేశంలోని ఎక్కువమంది ఆధారపడిన 2జీపై కూడా జియో కంపెనీ దృష్టి సారిస్తోంది.

సుమారు 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకూ ఉన్న ఈ వినియోగదారులను అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించడం వల్ల వారిని తమ సంస్థవైపు ఆకట్టుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. ఇటీవల రిలయన్స్ సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశం 5జీ దశలోకి మారుతోంది. ఈ క్రమంలో, దేశంలో ఉన్న సుమారు 35 కోట్ల మంది 2జీ వినియోగదారులకు 5జీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని రిలయన్స్ సంస్థ యోచిస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ వినియోగదారులు 5జీ ఫోన్‌లను కొనేందుకు క్యూ కడుతున్నారు.

ఇలాంటి సమయంలో అతి తక్కువ ధరకే 5జీ ఫోన్‌లను ఇవ్వడం ద్వారా మంచి ఆదరణ సంపాదించవచ్చని రిలయన్స్ జియో భావిస్తోంది. మరోవైపు, రిలయన్స్ జియో కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని 5జీ ప్రయోగాలు చేసేందుకు స్పెక్ట్రమ్ కేటాయించాలంటూ అభ్యర్థిస్తోంది. కానీ, చైనాతో వివాదం, కరోనా సంక్షోభ పరిస్థితుల్లో 5జీ సాంకేతికతకు అవసరమైన పరికరాలను స్థానికంగా తయారుచేసిన వాటినే ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.



Next Story