పెరిగిన రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు

by  |
Digital-life1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్‌ జియో మరోసారి పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుత ఏడాది ఆగస్టులో జియో మొత్తం 6.49 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించింది. దీంతో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 44.38 కోట్లకు చేరుకుంది. ఇక, ఎయిర్‌టెల్ 1.38 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుంది. మొత్తం వినియోగదారుల సంఖ్య 35.41 కోట్లకు పెరిగింది. ఈ మేరకు ఆగస్టు నెలకు సంబంధించిన సబ్‌స్క్రైబర్ల డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ బుధవారం విడుదల చేసింది. ఆగస్టు నెలకు గానూ వొడాఫోన్ ఐడియా గత ధోరణిలోనే 8.33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో కంపెనీ వినియోగదారుల సంఖ్య 27.1 కోట్లకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో జియో సంస్థ మరోసారి తన సత్తా చాటింది. రిలయన్స్ జియో గ్రామీణ వినియోగదారుల సంఖ్య ఆగస్టులో 19.9 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల సంఖ్య 13.8 కోట్లకు, ఎయిర్‌టెల్ 17.07 కోట్లకు తగ్గాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. జియో మార్కెట్ వాటా 37.40 శాతం, ఎయిర్‌టెల్, 29.83 శాతానికి పెరగ్గా, వొడాఫోన్ ఐడియా 22.84 శాతానికి క్షీణించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి భారత్‌లో మొత్తం టెలిఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా 1 లక్ష మంది తగ్గి 118 కోట్లకు పడిపోయింది.


Next Story

Most Viewed